ఆమ్లెట్ వివాదం: కత్తితో దాడి, అక్కడికక్కడే కస్టమర్ మృతి!
కోపోద్రిక్తుడైన రాజు అతని స్నేహితుడు మహేష్ భగవత్ ను గట్టిగా పట్టుకున్నారు. మరో స్నేహితుడు సోను భగవత్ ను కత్తితో పొడిచాడు.
ముంబై: ఆమ్లెట్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఆఖరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ముంబై సమీపంలోని నాలా సోపారాలో గత శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రవి భగవత్ అనే నలభై ఏళ్ల వ్యక్తి నాలా సోపారాలో నివాసం ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి ఓ స్నేహితుడితో కలిసి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. రెండు ప్లేట్ల బ్రెడ్ ఆమ్లెట్ కావాలని ఆర్డర్ చేశాడు. తిన్నాక భగవత్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రాజుకి రూ.20ఇచ్చాడు. అయితే ఇంకా రూ.4ఇవ్వాలని, బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కోటి రూ.12 అని రాజు చెప్పాడు.
దీంతో భగవత్ రాజుకు రూ.5 ఇచ్చాడు. ఆ సమయంలో భగవత్ రాజుపై నోరు పారేసుకున్నాడు. అలా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రాజు అతని స్నేహితుడు మహేష్ భగవత్ ను గట్టిగా పట్టుకున్నారు. మరో స్నేహితుడు సోను భగవత్ ను కత్తితో పొడిచాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో భగవత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తులిని స్టేషన్ పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భగవత్ను కత్తితో పొడిచిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. మరో ఇద్దరు నిందితులు రాజు, మహేష్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.