కూల్చేయండి: షారుక్ఖాన్ బిల్డింగ్ కాంట్రోవర్సీపై బీజేపీ ఎంపీ పూనమ్
ముంబై: బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ ఖాన్ భవనం మన్నత్ చుట్టుపక్కల అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి భారతీయ జనతా పార్టీ నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు పూనమ్ మహాజన్ ఆ భవంతిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు!
పూనమ్ మహాజన్ ముంబై నార్త్ సెంట్రల్ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బాంద్రాలోని షారుక్ ఖాన్ భవంతిని ఆనుకొని ఉన్న ర్యాంప్ను తొలగించాలని పూనమ్ బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ)ని డిమాండ్ చేశారు.
పూనమ్ మహాజన్ ఈ ఏడాది జనవరి 29వ తేదీన బీఎంసీ చీఫ్కు లేఖ రాశారు. స్టార్ హీరో ఇంటి పక్క ర్యాంప్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ర్యాంప్ను సదరు సూపర్ స్టార్ వ్యానిటీ వ్యాన్ పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారని, అది స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
షారుక్ ఖాన్ ఈ ర్యాంప్ను అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె లేఖలో దానిని పేర్కొన్నారు. ర్యాంప్ సదరు భవనం యజమాని అక్రమంగా నిర్మించారని ఆమె పేర్కొన్నారు. అయితే, అందులో షారుక్ ఖాన్ పేరు లేదా అతని భవనం మన్నత్ పేరును పేర్కొనలేదు.
సమాచారం మేరకు చాలామంది స్థానికులు ఆ ర్యాంప్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు పూనమ్ మహాజన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ర్యాంప్ నిర్మించిన ఆ స్థలం ప్రభుత్వానిది అని, దానిని స్థానికులు ఉపయోగించుకునేందుకు విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
2014వ సంవత్సరంలో పలువురు మన్నత్ భవనం ముందు ర్యాంప్ నిర్మాణాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ర్యాంప్ వల్ల స్థానికంగా ఉన్న చర్చ్కు వెళ్లేందుకు కష్టమవుతోందని వారు ఆరోపించారు.