సినీ ఫక్కీలో తుపాకితో బెదిరించి మహిళ కిడ్నాప్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం ఓ మహిళను సినీ ఫక్కీలో తుపాకీతో బెదిరించి ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆ మహిళ, కిడ్నాపర్ల కోసం వసాయ్-విరార్ బెల్ట్లో దాదాపు 50 మంది పోలీసులు గాలిస్తున్నారు.
మహిళ నడిపిస్తున్న కారు ప్రమాదవశాత్తు తగిలినందుకు ఆ వ్యక్తి కిడ్నాప్కి పాల్పడినట్లు తెలుస్తోంది.కిడ్నాప్ అయిన మహిళను శిల్ప బెర్మా(40)గా పోలీసులు గుర్తించారు. శిల్ప తన స్నేహితురాలు నూపుర్ కుమారి శ్రీవాస్తవ(50)తో కలిసి బుధవారం మధ్యాహ్నం కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు శ్రీవాస్తవ ప్రత్యక్ష సాక్షి.
ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. శిల్ప కారు నడుపుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో అతడు కోపంతో గట్టిగా కేకలు వేశాడు. సర్దిచెప్పేందుకు కారు తలుపులు తెరిచి దిగబోతుండగా అతను బలవంతంగా కారులోకి చొరబడి డ్రైవింగ్ సీటు పక్క సీట్లో కూర్చుని తుపాకీతో శిల్పను బెదిరించాడు. కారును గ్రీన్ సిటీ చుట్టూ గంటన్నర పాటు తిప్పించాడని శ్రీవాస్తవ తెలిపారు.
తర్వాత కారు స్తంభానికి ఢీకొనడంతో తాము తప్పించుకోవడానికి ప్రయత్నించామని చెప్పారు.. కానీ అతడు తుపాకీతో బెదిరించి శిల్పను లాక్కుపోయాడని, తాను వారి వెనుక వెళ్లడానికి ప్రయత్నించగా తనని బెదిరించి శిల్పను తీసుకొని ఆటో ఎక్కాడని చెప్పారు.
ఆటో డ్రైవర్ను కూడా గన్తో బెదిరించాడని చెప్పారు. శ్రీవాస్తవ వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. దీంతో పోలీసులు బృందాలుగా నగరమంతా గాలిస్తున్నారు. శ్రీవాస్తవ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.