అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు!: ముంబైలో వర్ష భీభత్సం, 1997తర్వాత మళ్లీ!
చెరువలను తలపించే రోడ్లు, మోకాళ్ల లోతు నీళ్లతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Recommended Video

ముంబై: దేశ ఆర్థిక రాజధానిని కుండపోత వర్షం ముంచెత్తింది. వరుణుడి దెబ్బకు నగరం మొత్తం చివరుటాకులా వణికిపోయింది. చెరువలను తలపించే రోడ్లు, మోకాళ్ల లోతు నీళ్లతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగిపోయాయి. ఓ చోట భవనం కూలి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 24గం.ల్లోనే 29సెం.మీ వర్షం నమోదవడంతో ముంబై మునుపెన్నడూ లేని కష్టాలను ఎదుర్కొంటోంది.మరో

1997తర్వాత ఇదే అత్యధికం:
1997తర్వాత ఒక్క రోజు నిడివిలో ముంబైలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం గమనార్హం. మంగళవారం ఉదయం 8.30గం. నుంచి 11.30 మధ్య కేవలం మూడు గంటల వ్యవధిలోనే సగటున 6.5సెం.మీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చెప్పింది. వరద నీటిలో చిక్కుకుపోయిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అటు అలల ఉధృతి కూడా పెరగడంతో వర్షపు నీరు సముద్రంలో కలవడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.

కేంద్రం భరోసా:
వరదలతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్రకు కేంద్రం భరోసా ఇచ్చింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రధాని మోడీ ఫోన్ ద్వారా మాట్లాడారు. పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు.
ముంబై పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ వివిధ శాఖల అధికారులతో భేటీ అయి రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్, నగర పాలక సంస్థ అధికారులతో సహాయ చర్యల గురించి చర్చించారు.
సచివాలయంలోని ఉద్యోగులను ముందుగానే ఇళ్లకు పంపించేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, కార్యాలయాలు కూడా విద్యార్థులు, ఉద్యోగులను ఇళ్లకు పంపించేయాల్సిందిగా ఆదేశించారు.

సహాయ చర్యలు ముమ్మరం:
ముంబై వరద బాధితులను ఆదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో వరద సహాయక బృందాలు, హెలికాప్టర్లు, ఈతగాళ్లు, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని నేవీ అధికార ప్రతినిధి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అటు నౌకాదళం కూడా సహాయక చర్యల కోసం సిబ్బందిని, సామాగ్రిని సిద్దం చేసింది.

మరో హెచ్చరిక:
మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా.. ముంబైలో పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ముంబై, దక్షిణ గుజరాత్, కొంకణ్, గోవా, పశ్చిమ విదర్భ తదితర ప్రాంతాల్లో ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, పరిస్థితి మరింత దిగజారుతుందోమోనని పుణేలోని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, 2005లో ముంబైని ముంచెత్తిన వరదల్లో అప్పట్లో 500మంది చనిపోయారు.

లోకల్ ట్రైన్ల పునరుద్దరణ:
భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడటంతో చాలావరకు రైళ్లను నిలిపేశారు. మూడు సబర్బన్ మార్గాల్లోను రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని గంటల తరబడి పట్టాల పైనే నిలిచిపోయాయి. అనేకమంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయారు.
బుధవారం మాత్రం కొన్ని లోకల్ ట్రైన్స్ ను పునరుద్దరించినట్లు తెలుస్తోంది. భారీ వర్షం వల్ల ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయంలోను రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో 6విమానాలను పూర్తిగా రద్దు చేయగా, పదింటిని ఇతర విమానశ్రయాలకు మళ్లించారు.
ఐదుగురు మృతి:
థానేలోని ఓ మురుగు నీటి కాల్వలో పడి 32ఏళ్ల మహిళతో పాటు, మరో బాలిక(14) మృతి చెందింది. థానేలోని ఒక మాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక విఖ్రోలిలో ఓ భవనం కూలిపోవడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చాలామంది వాహనదారులు తమ కార్లను రోడ్ల పైనే నిలిపేసి వెళ్లిపోయారు. నగరంలోని చాలా ఇళ్లు వర్షం ధాటికి దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.












Click it and Unblock the Notifications