చెన్నైకి గుండెను పంపించిన ముంబై: 1300కి.మీ.., ప్రాణం నిలబడింది
ఇందుకోసం చేతన్ గుండె ముంబై నుంచి చెన్నై వరకు ఏకంగా 1300కి.మీ ప్రయాణించడం విశేషం.
ముంబై: మునుపటితో పోల్చితే అవయవదానంపై ప్రజల్లో చాలా మేరకు అవగాహన పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన తమవారి అవయవాలను మరొకరికి దానం చేసేందుకు వారు ముందుకొస్తున్నారు.
తాజాగా ముంబైలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఏకంగా 1300కి.మీ దూరం దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి విజయవంతంగా మరొకరికి అమర్చారు.
వివరాల్లోకి వెళ్తే..నేవీ ముంబైకి చెందిన చేతన్ టేలర్ అనే ఓ చిరు వ్యాపారి ఇటీవల తీవ్ర అస్వస్థతతో 20రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరాడు. మెదడులో రక్తస్రావం కారణంగా అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని చేతన్ భార్య, పిల్లలకు చెప్పి అతని గుండెను దానం చేయించేందుకు ఒప్పించారు.
అలా చేతన్ గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న లెబనాన్కు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు అమర్చారు. ఇందుకోసం చేతన్ గుండె ముంబై నుంచి చెన్నై వరకు ఏకంగా 1300కి.మీ ప్రయాణించడం విశేషం. ముంబై ఆసుపత్రి నుంచి గుండెను తరలించే క్రమంలో అధికారులు ఎక్కడిక్కడ ట్రాఫిక్ను నియంత్రించడంతో కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబై ఎయిర్ పోర్ట్కు చేర్చారు.
ఆపై ముంబై ఎయిర్ పోర్టు నుంచి చార్టెడ్ విమానంలో కేవలం నాలుగు గంటల్లో చెన్నైలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకొచ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.