రూ.510 కోసం కారు దిగితే.. రూ.10లక్షల విలువైన వజ్రాలు ఎత్తుకెళ్లారు
ముంబై: మనది కానిదాని కోసం ఆశపడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ.. మోసపోయేవాళ్లు మాత్రం మోసపోతూనే ఉన్నారు.
తాజాగా ముంబైలో జరిగిన ఘటన ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఓ వ్యాపారి రూ.510 కోసం కారు దిగితే.. రూ.10 లక్షల విలువైన వజ్రాలను కోల్పోవాల్సి వచ్చింది.
రూ.510 మీవేనా??
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబైలో ఓ వ్యాపారవేత్త తన కారులో కూర్చుని ఉన్నాడు. ఆయన్ను సమీపించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు, అతని కారు బయట డబ్బులు పడి ఉన్నాయని, తమవేనా అని అడిగారు. ఆ డబ్బుల కోసం కారు దిగారు వ్యాపారవేత్త.
కారు దిగగానే.. 10లక్షల వజ్రాలు
రూ.510 కోసం అతను కారు దిగగానే.. వెంటనే వెనక డోరును తెరుచుకుని, సీటులో ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. కాగా, ఆ బ్యాగులో రూ.10 లక్షల విలువైన డైమాండ్స్ను ఉన్నట్టు బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
డబ్బులను చూసి..
రూ.10, రూ.20కు చెందిన కొన్ని నోట్లు అంటే మొత్తం రూ.510 విలువైన డబ్బులు వ్యాపారవేత్త కారుకు వెలుపల పడేసి ఉన్నాయని, ఇవి తన డబ్బులేనా? అని వారు అతడ్ని అడిగారని డీబీ మార్గ్ పోలీసు స్టేషన్ ఆఫీసర్ చెప్పారు. దీంతో డబ్బుల్ని చూసిన ఆ వ్యాపారవేత్త.. కారు దిగాడని.. అంతలోనే గ్యాంగ్ సభ్యుల్లో ఒకరు వెనుక డోరు తెరచి, బ్యాగ్ను తీసుకొని పారిపోయాడని చెప్పారు.
510కోసం వెళితే.. రూ.10లక్షల విలువైన వజ్జాలు మాయం
దుండగులు కొట్టేసిన అనంతరం తన వెనుక సీట్లో ఉన్న బ్యాగ్ పోయినట్టు వ్యాపారవేత్త గుర్తించాడని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.