పెళ్లి ప్రలోభం, రూ.కోట్లతో వచ్చానంటూ యువతికి మోసం, రూ.74 లక్షలు గోవిందా
ఓ ముంబై యువతిని వినూత్న తరహాలో మోసం చేశాడో నైజీరియన్.
ముంబై: తాజాగా ఓ ముంబై యువతిని వినూత్న తరహాలో మోసం చేశాడో నైజీరియన్. పెళ్లి నిమిత్తం కోట్లాది డాలర్లు తీసుకు వస్తున్నానని చెప్పి, ఆపై ఢిల్లీలో చిక్కుకుపోయానంటూ ఫోన్ చేసి, పాపం అతడ్ని గుడ్డిగా నమ్మిన ఆ యువతి నుంచి ఏకంగా రూ. 74 లక్షలు గుంజేశాడు.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని శివాజీ పార్కు సమీపంలో ఉండే 40 సంవత్సరాల యువతి, తన రెండో వివాహం నిమిత్తం ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ప్రొఫైల్ పెట్టింది. ఆపై కొన్ని రోజులకు ఓ ఈ-మెయిల్ వచ్చింది.
ఈమెయిల్ చూడగానే ఫ్లాట్ అయిపోయింది...
తెరిచి చూసిన ఆమెకు అది అమర్ జోషిఅనే వ్యక్తి నుంచి వచ్చినట్లు అర్థమైంది. తనను తాను యూకేలో నివసిస్తున్న ఎన్నారైగా పరిచయం చేసుకున్న అమర్ జోషి యువతి ప్రొఫైల్, ఫోటోలు తనకు నచ్చాయని, తనకు ఓ భారతీయ భార్య కావాలని కోరుకుంటున్నానని, ఇష్టమైతే, పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు.
నిశ్చితార్థానికి వస్తున్నానంటూ...
అతని ఫొటో, ప్రొఫైల్ కూడా నచ్చడంతో, వారిద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై వారిద్దరి మధ్యా సంభాషణలు సాగుతుండగా, ఓ రోజు నిశ్చితార్థం చేసుకునేందుకు ముంబైకి వస్తున్నానని చెబుతూ అమర్ జోషి అతడొస్తున్న విమానం టికెట్ల వివరాలను ఆ యువతికి పంపాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు రావాలని కూడా కోరాడు.
అతడు రాలేదుగానీ, ఫోన్ కాల్ వచ్చింది...
ఎంతో సంతోషంతో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లగా అమర్ జోషి రాలేదుగానీ, ఆ యువతికి ఓ ఫోన్ వచ్చింది. తొలుత మాట్లాడిన అమర్, ఆపై మరో మహిళకు ఫోన్ ఇచ్చాడు. సదరు మహిళ తాను ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నానంటూ పరిచయం చేసుకుంది. పరిమితికి మించిన యూఎస్ డాలర్లతో అమర్ జోషి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడని, రూ. 38 లక్షలు చెల్లిస్తేనే అతన్ని విడుదల చేస్తామని చెప్పింది.
కాబోయే భర్తను విడిపించుకునేందుకు...
ఆమె చెప్పిన మాటలను ముంబై యువతి గుడ్డిగా నమ్మేసింది. కాబోయే భర్తను విడిపించుకోవడం కోసం రూ.38 లక్షలను ఆ మహిళ చెప్పిన మేరకు నాలుగు ఖాతాల్లో జమ చేసింది. తరువాతి రోజు, మళ్లీ అమర్ జోషి ఫోన్ చేశాడు. తాను ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని, కాసేపట్లో వచ్చేస్తున్నానని చెప్పడంతో ముంబై యువతి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.
మళ్లీ అదే మోసం...
అంతలోనే మళ్లీ అతడి నుంచి ఫోన్. ముంబైలో కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని సమాచారం. తాను త్వరగా బయటకు వచ్చేందుకు సహకరించాలన్న అమర్ జోషి మాటలను ఈసారి కూడా ముంబై యువతి నమ్మేసింది. మళ్లీ వారు చెప్పినట్లుగానే మరో 6 బ్యాంకు ఖాతాల్లో రూ. 36 లక్షలు జమ చేసింది. ఆ తరువాత షరా మామూలే. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమర్ జోషి నుంచి ఎలాంటి స్పందన లేదు.
మోసపోతేనేగాని అర్థం కాదా?
ఇదంతా జరిగాకగానీ ముంబై యువతికి అర్థం కాలేదు.. తాను గుడ్డుగా మోసపోయానని. అర్థమయ్యాక ఆమె పోలీసుల దగ్గరికి పరిగెట్టింది. దీంతో వారు ఈ మోసంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ క్రైం నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో.. నైజీరియన్ ముఠాలు కూడా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నాయి. ఎన్ని వార్తలు చదువుతున్నా.. టీవీల్లో చూస్తున్నా.. చాలా మందికి మోసపోయాకగాని అర్థం కాకపోతుండడం బాధాకరమైన విషయం.