డ్రగ్స్ కు బానిసైన కొడుకు.. కోడలికి నరకయాతన.. చున్నీతో ఉరేసి చంపేసిన తల్లి
మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, ప్రతిరోజు కోడలికి నరకయాతన చూపిస్తున్న కొడుకును.. కడుపు తీపిని కూడా చంపుకుని.. కన్నతల్లే హతమార్చిన సంఘటన ముంబైలో జరిగింది.
ముంబై: మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, ప్రతిరోజు కోడలికి నరకయాతన చూపిస్తున్న కొడుకును.. కడుపు తీపిని కూడా చంపుకుని.. కన్నతల్లే హతమార్చిన సంఘటన ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... ముంబైలోని మన్ఖుర్ద్ ప్రాంతానికి చెందిన నదీమ్(25)కు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటుంది. పెళ్లి చేస్తే బాగుపడతాడనుకుని అతని తల్లి అన్వారీ(45) రెండేళ్ల క్రితం అలహాబాద్కి చెందిన యువతితో వివాహం జరిపించింది.
పెళ్లయిన తరువాత కూడా నదీమ్లో ఎలాంటి మార్పూ రాకపోగా, ఏదో ఒక వంకతో ప్రతిరోజు భార్యను చావగొట్టేవాడు. ఈ బాధలు తట్టుకోలేక పెళ్లయిన ఐదు నెలలకే నదీమ్ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.
తర్వాత అత్త అన్వారీ వచ్చి నచ్చజెప్పడంతో తిరిగి సోమవారం కాపురానికి వచ్చింది. ఆ మరుసటిరోజే.. అంటే మంగళవారం నదీమ్ మళ్లీ డ్రగ్స్ తీసుకుని ఇంటికి రావడం గమనించిన అన్వారీ, మళ్లీ ఏదో ఒక గొడవ చేస్తాడని గ్రహించి కోడల్ని తన స్నేహితురాలింటికి పంపింది.
ఈ విషయం తెలిసిన నదీమ్ కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా కొట్టాడు. ఇక తన కొడుకు ఎన్నటికీ మారడు అనుకున్న అన్వారీ చున్నీతో ఉరేసి నదీమ్ని చంపేసింది. తర్వాత రాత్రంతా కొడుకు మృతదేహం పక్కనే రోదిస్తూ కూర్చుంది.
మర్నాడు ఉదయం నదీమ్ భార్య ఇంటికి తిరిగి రాగానే తన అత్త ఏడుస్తూ ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. కుటుంబాన్ని రక్షించుకోవడానికి నదీమ్ని చంపేశానని అన్వారీ చెప్పడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అన్వారీపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.