మరుగుదొడ్డి కోసం తాళి విక్రయం: పంకజ సత్కారం
ముంబై: మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఓ మహారాష్ట్ర మహిళ మంగళసూత్రాన్ని విక్రయించింది. సంగీత అవ్హాలే అనే ఆ మహిళను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే గురువారంనాడు సత్కరించారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో గల సైఖేడా గ్రామానికి చెందిన సంగీత మరుగుదొడ్డిని కట్టుకోవడానికి తన మెడలోని తాళిని విక్రయించింది.
ఆభరణాలతో పోలిస్తే మరుగుదొడ్డి ప్రాథమిక ఆవసరమని, తన ఆభరణాలను అన్నింటినీ విక్రయించి టాయిలెట్ నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని సంగీత ముండై కార్యాలయంలో మీడియాతో చెప్పారు. దేశంలోని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టాయిలెట్లు లేవని, దాంతో మహిళలు తీవ్ర సమస్యను ఎదుర్కుంటున్నారని పంకజ ముండే అన్నారు.
శాసనసభ్యురాలిగా తన తొలి విడతనే మరుగుదొడ్ల నిర్మాణానికి 25 శాతం నిధులు కేటాయిస్తూ వచ్చానని ఆమె చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలనేది తమ లక్ష్యమని, మహిళలు ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకూడాదనేది ఉద్దేశమని ఆమె అన్నారు.
సంగీత చొరవను పంకజ ముండే ప్రశంసించి, కొత్త మంగళసూత్రాన్ని ప్రదానం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో చైతన్యం పెంచాలనే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాన్ని ముందుకు తీసుకుని పోవడానికి చొరవ చూపినందుకు ప్రశంసగా సంగీతకు ఆ బహుమతి ఇచ్చినట్లు పంకజ ముండే చెప్పారు.