షీనా హత్య, ఇంద్రాణి కార్నర్! కోర్టులో సొమ్మసిల్లింది
ముంబై: షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణికి సంబంధించి పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది.
ఆమెను నేరస్తురాలిగా తేల్చేందుకు అవసరమైన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని, ఆమెను కార్నర్ చేసేందుకు కావాల్సిన సమాచారం సేకరించారని తెలుస్తోంది. పోలీసుల వద్ద కీలకమైన ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
శ్యాం రాయ్ (ఇంద్రాణి డ్రైవర్) - కేసులో శ్యాం రాయ్ కీలక నిందితుడు. హత్యలో అతని పాత్ర కూడా ఉంది. ఇతను ఆ సమయంలో ఇంద్రాణికి డ్రైవర్గా ఉన్నాడు.
రాహుల్ ముఖర్జీ - రాహుల్ ముఖర్జీ కేసులో కీలక సాక్షి. షీనా హత్య సమయంలో రాహుల్కు, షీనాతో రిలేషన్ షిప్ ఉంది. దీనిని తల్లి ఇంద్రాణి భరించలేకపోయింది. ఇతని నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
మిఖాయిల్ బోరా - షీనా సోదరుడు మిఖాయిల్ బోరా. తన తల్లి సోదరిని ఎందుకు హత్య చేసిందో తనకు తెలుసునని ఆయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అతనిని విచారించారు. ఇంద్రాణినే హత్య చేసిందని చెప్పేందుకు తన వద్ద ఫోటో గ్రాఫ్, ఇతర ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
సంజీవ్ ఖన్నా - కేసులో నిందితుడు. ఇతను ఇంద్రాణి రెండో భర్త. ఇంద్రాణి కోసం ఘాతుకానికి పాల్పడినట్లుగా అంగీకరించాడని సమాచారం. అతను ఆర్థిక కారణాల వల్ల ఇంద్రాణితో చేయి కలిపాడని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మిఖాయిల్ను చంపేందుకు ఇంద్రాణి ఓ వ్యక్తికి రూ.2.5 లక్షలు ఇచ్చింది. అయితే, ఆమె ప్లాన్ ఫెయిల్ అయింది.
ఇంద్రాణికి విషం పెట్టొచ్చు: కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూషన్
కన్నకూతురు షీనా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంద్రాణిని సోమవారం ముంబైలోని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంద్రాణిని విచారించడానికి మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు.
ఇది ఇలా ఉండగా, ఇంద్రాణిపై విష ప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ఆమె ఇంటి నుంచి ఆహారాన్ని అనుమతించరాదని ప్రాసిక్యూషన్ వాదించింది. కాగా, కోర్టులో ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఊహించని విధంగా ఆమె కళ్లుతిరిగి కిందపడిపోయారు. కొంతసేపటి తర్వాత ఆమె మళ్లీ కోలుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు... ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది.
ఎన్నో గంటలపాటు ప్రశ్నించారు
ఇంద్రాణిని పోలీసులు ఇప్పటికే 80 నుంచి 90 గంటల పాటు ప్రశ్నించారు. ఈమెపై ఐపీసీ సెక్షన్ 307పై కూడా ప్రయోగించారు. అంతేకాకుండా, తన కుమారుడైన మైఖేల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణి ప్రయత్నించిందని పోలీసులు ఆరోపిస్తూ హత్యాయత్న కేసును కూడా నమోదు చేశారు.
ఇదిలావుండగా, ఇంద్రాణి తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్పై విచారణలో భాగంగా ముంబై పోలీసులు భౌతికంగా దాడిచేశారని ఆరోపించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు వీలుగా ఈ దాడి చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా ఇంద్రాణి చెంపపై పదేపదే కొట్టారని, దీంతో ఆమె చెంప వాచిపోయివుందన్నారు.
ఇంద్రాణిపై మరో కేసు
ఇంద్రాణీపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. షీనా హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణీ కుమారుడు మిఖాయిల్ బోరాను కూడా హత్య చేసేందుకు కుట్రపన్నిందని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఆమె, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె కారు డ్రైవర్ శ్యామ్ రాయ్లపై మరో కేసు నమోదు చేశారు.