తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
బెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తే హంతకుడని తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అతను చెప్పిన కారణాలు పోలీసులకు సైతం నివ్వెరపరిచేలా చేశాయి. ఓ చిన్న వివాదం కారణంగా తల్లికుమార్తెలను హత్య చేయాల్సి వచ్చిందంటూ నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మార్గమధ్యలోనే కాపు కాసి హత్య
హతుల పేర్లు కవిత, జగశ్రీ. వారిద్దరూ తల్లికుమార్తెలు. కర్ణాటకలో మడికేరి సమీపంలోని సోమవార పేట దొడ్డమల్తే నివాసం ఉంటున్నారు. వారికి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉన్నాయి. కాఫీని సాగుచేసుకునే కుటుంబం వారిది. కవిత భర్త పదేళ్ల కిందటే అనారోగ్య కారణాలతో మరణించారు. అప్పటి నుంచి ఆమె కుమార్తె జగశ్రీ, కుమారుడు మేఘమథన్ రాజ్తో కలిసి సోమవార పేటలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు కవిత, జగశ్రీలను దారుణంగా గొంతు కోసి హత్యచేశారు. స్కూటీపై కాఫీ ఎస్టేట్కు వెళ్తున్న వారిద్దరినీ మార్గమధ్యలోనే కాపు కాసి హత్య చేశారు.
దిలీప్ విచారణ సందర్భంగా
ఈ ఘటనపై కవిత కుమారుడు మేఘమథన్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవార పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభంచారు. విచారణలో భాగంగా మథన్ రాజ్ అనుమానాలు మేరకు దిలీప్ అనే వ్యక్తి సహా మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో దిలీప్ విచారణ సందర్భంగా పోలీసులకు పొంతనలేని సమాధానాలను ఇవ్వడంతో అతనిపై అనుమానాలు బలపడ్డాయి. అతణ్ణి తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయాన్ని వెల్లడించాడు. తానే హంతకుడినని అంగీకరించాడు.
స్నేహితుడి సహకారంతో బైక్పై
సోమవార పేటలో కవిత కుటుంబం నివసించే ప్రాంతానికే చెందిన దిలీప్కు ఆస్తితగాదాలు ఉన్నాయి. కవిత ఇంటికి ఆనుకునే దిలీప్కు కొంత స్థలం ఉంది. అందులో ఓ ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు దిలీప్. నిర్మాణం సందర్భంగా కవిత ఇంటికి చెందిన కొంత స్థలాన్ని అతను ఆక్రమించుకున్నాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ చిన్న వివాదం కాస్త చిలికి చిలికి గాలీవానగా మారింది. మనస్పర్థలకు దారి తీసింది. కవితను హత్య చేయడానికి పథకం పన్నాడు దిలీప్. కవిత, జగశ్రీ స్కూటీపై కాఫీ ఎస్టేట్కు వెళ్తున్న సమయంలో తన స్నేహితుడి సహకారంతో బైక్పై వారిని వెంబడించాడు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో స్కూటీని అటకాయించి, దాడి చేశాడు. కత్తితో ఇద్దరి గొంతు కోసం పరారయ్యాడు. ఈ కేసులో పోలీసులు దిలీప్ స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.