అమిత్ షాకు సినిమా చూపించిన మఠాధిపతి, ముందు నుయ్యి, వెనుక గొయ్యి, క్రెడిట్ ఎవరికి!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రి వర్గం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. బీజేపీ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైయ్యింది. ఏం చెయ్యాల్లో తెలీక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పుడు అయోమయంలో పడిపోయారు.
కర్ణాటకలో అమిత్ షా
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొన్ని రోజులుగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కర్ణాటకలోని వీరశైవ, లింగాయుతలకు చెందిన 40కు పైగా మఠాలు తిరిగిన అమిత్ షా స్వామీజీల ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలని మనవి చేస్తున్నారు.
మురఘరాజేంద్ర మఠం
కర్ణాటకలోని చిత్రదుర్గలోని ప్రసిద్ది చెందిన శ్రీ మురఘ రాజేంద్ర మఠాన్ని అమిత్ షా సందర్శించారు. శ్రీ మురుఘ రాజేంద్ర మఠాధిపతి జగద్గురువు డాక్టర్ శ్రీ శివమూర్తి శరుణుల స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఇదే సందర్బంలో అమిత్ షా, బీఎస్. యడ్యూరప్ప డాక్టర్ శ్రీ శివమూర్తి శరణుల స్వామీజీని పట్టు వస్త్రాలతో సన్మానించారు.
అమిత్ షాకు సినిమా
శాసన సభ ఎన్నికల్లో మీ మద్దతు కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మురుఘ రాజేంద్ర మఠాధిపతి జగద్గురువు డాక్టర్ శ్రీ శివమూర్తి శరణుల స్వామీజీకి మనవి చేశారు. అదే సమయంలో డాక్టర్ శ్రీ శివమూర్తి శరణుల స్వామీజీ అమిత్ షాకు ఓ వినతి పత్రం ఇచ్చి సినిమా చూపించారు.
కాంగ్రెస్, బీజేపీ
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లింగాయుతులకు ప్రత్యేక మతం గుర్తించి, మైనారిటీ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందని, మీ మద్దతు మాకు కావాలని జగద్గురువు డాక్టర్ శ్రీ శివమూర్తి శరణుల స్వామీజీ మనవి చేస్తూ వినతి పత్రం ఇవ్వడంతో అమిత్ షా షాక్ కు గురైనారు.
క్రెడిట్ ఎవరికి !
లింగాయుతలకు ప్రత్యేక మతం, మైనారిటీ రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందని బీజేపీ బయపడుతోంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత సరైన నిర్ణయం తీసుకుంటామని స్వామీజీకి హామీ ఇచ్చిన అమిత్ షా చిన్నగా తప్పించుకున్నారు. అమిత్ షా వెంట కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.