కూతుర్ని ప్రేమిస్తున్నాడని చంపి, పెరట్లో పాతేశారు
ముజఫర్నగర్: మతాలు వేరైన ఆ రెండు కుటుంబాలు సుమారు 20ఏళ్లుగా పక్క పక్కనే ఉంటూ ఎంతో సామరస్యంగా ఉంటున్నాయి. అయితే, 2013లో ముజఫర్నగర్లో చెలరేగిన మతకల్లోలం ఆ కుటుంబాల మధ్య మాటల్లేకుండా చేశాయి. ఈ క్రమంలో తమ కూతురును లోబర్చుకున్నాడనే కారణంతో పక్క ఇంటి యువకుడ్ని చంపేసి పాతిపెట్టింది మరో కుటుంబం. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
యువకుడి హత్య కారణంగా ముజఫర్నగర్ పరిధిలో గల కవాల్ గ్రామంలో గడిచిన సోమవారం రాత్రి నుంచి కొంత ఉద్రిక్తంగానే ఉంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్రీపాల్ శైనీ, షకీల్ అహ్మద్లు ప్రక్కప్రక్క నివాసం ఉంటున్నారు. శ్రీపాల్ శైనీకి ఇద్దరు కుమారులు(పవన్, మోహన్) ఒక కుమార్తె(15) ఉన్నారు.
షకీల్ అహ్మద్కు 16ఏళ్ల కొడుకు ఇర్షాద్ ఉన్నాడు. కాగా, ఇర్షాద్ తన కుమార్తెతో సంబంధం కలిగి ఉన్నాడని సోమవారం రాత్రి శ్రీపాల్శైనీకి తెలియడంతో కోపోద్రిక్తుడైన తండ్రి ఇర్షాద్ను గొంతునులిమి చంపాడు.
అనంతరం ఇంటి పెరట్లోనే శవాన్ని పాతిపెట్టాడు. సోమవారం రాత్రి గడిచిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో షకీల్ భయాందోళనకు గురైయ్యాడు. ఇంతకుమందు ఇలా ఎన్నడూ జరగకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇర్షాద్, బాలిక ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా చూసినట్లు విచారణలో పోలీసుల దృష్టికి వచ్చింది. బాలుడి కాల్ డిటేల్స్ సేకరించగా ఒక నెంబర్కు ఎక్కువగా కాల్ చేసి మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆసక్తికరంగా రెండు సిమ్కార్డులు అతని పేరు మీదనే ఉన్నాయి. విచారణలో ఓ సిమ్ కార్డు పక్కింటి అమ్మాయికి ఇచ్చి మాట్లాడుతున్నట్లు తేలింది.
అనుమానం, సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు అమ్మాయి సోదరులను పిలిచి విచారించారు. పోలీసు విచారణలో యువకుడిని హత్యచేసింది తామేనని పేర్కొంటూ జరిగిన విషయమంతా వెల్లడించారు. గురువారం రాత్రి పోలీసులు ఇంటి పెరట్లోకి వెళ్లి తవ్వి చూడగా యువకుడి శవం బయటపడింది.
దీంతో ఇర్షాద్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయి తండ్రితో పాటు సోదరులిద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, యువకుడి తండ్రి మాట్లాడుతూ.. సమస్యను వారు తమ దృష్టికి తీసుకురావాల్సిందని, తామే తమ అబ్బాయిని మందలించేవాళ్లమని అన్నారు. తమ కుమారుడిని చంపి తమకు చాలా పెద్ద శిక్ష విధించారని కన్నీటిపర్యాంతమయ్యారు.
కాగా, 2013లో జరిగిన ముజఫర్నగర్ మతకల్లోలానికి కవాల్ గ్రామం ముఖ్యకేంద్రంగా ఉంది. ఈ అల్లర్లలో 63 మంది చనిపోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇర్షాద్ హత్య ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చి వ్యాప్తి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.