ముస్లిం వ్యక్తిపై మూక దాడి.. ముగ్గురు నిందితులు బెయిల్పై విడుదల.. అరెస్టయిన 24 గంటల్లోపే...
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 45 ఏళ్ల ఓ ముస్లిం వ్యక్తిపై ఓ మూక జరిపిన దాడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా... 24 గంటలు గడవకముందే వారికి బెయిల్ మంజూరైంది. నిందితులపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ అరెస్టయిన కొద్దిగంటలకే బెయిల్పై విడుదలవడం గమనార్హం.
యూపీలో దారుణం: ముస్లిం రిక్షావాలాపై మూక దాడి-కొట్టొద్దని కూతురు వేడుకున్నా...
బాధితుడిపై దాడికి పాల్పడిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో పోలీస్ బలగాలను మోహరించి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిందితులను శిక్షించేందుకు అవసరమైన ప్రతీ చట్టపరమైన చర్యను తాము తీసుకుంటున్నామని వెల్లడించారు.
మరోవైపు నిందితులు అజయ్ రాజేష్,అమన్ గుప్తా,రాహుల్ కుమార్ల అరెస్ట్ అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని... అందుకు సహకరించాలని పోలీసులు వారికి నచ్చజెప్పారు. దీంతో శాంతించిన భజరంగ్ దళ్ సభ్యులు... తమవారిని త్వరగా విడుదల చేయకపోతే మళ్లీ నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
స్థానిక భజరంగ్ దళ్ నేత కృష్ణ మాట్లాడుతూ.. 'ఎస్పీని మేం ఘెరావ్ చేశాం.అరెస్టయిన మా కార్యకర్తలను విడుదల చేసేంతవరకు ఆయన్ను కదలినిచ్చేది లేదని చెప్పాం. సీనియర్ పోలీస్ అధికారులు మాతో మాట్లాడి... పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మా కార్యకర్తలను విడుదల చేస్తామన్నారు. దీంతో మా నిరసనను ఉపసంహరించుకున్నాం.' అని చెప్పుకొచ్చారు.
కాన్పూర్లోని ఓ ప్రాంతంలో బుధవారం(ఆగస్టు 11) 45 ఏళ్ల ముస్లిం వ్యక్తిపై ఓ మూక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ముస్లిం వ్యక్తి రిక్షా తొక్కుతున్న సమయంలో అతన్ని అడ్డగించిన కొంతమంది వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేయాలని అతన్ని వీధుల్లో ఊరేగిస్తూ కొట్టారు. అతనితో పాటే ఉన్న అతని కూతురు.. నాన్నను కొట్టొద్దని వారిని వేడుకున్నా కనికరించలేదు. పోలీసులు ఎంట్రీ ఇచ్చాక కూడా వారి దాడి ఆగలేదు. ఆ వ్యక్తిని పోలీస్ జీపులో ఎక్కిస్తున్న సమయంలోనూ దాడికి పాల్పడ్డారు.దాడి జరిగిన ప్రాంతానికి 500మీటర్ల దూరంలో ఆ ఘటనకు కొద్దిసేపటి క్రితమే భజరంగ్ దళ్ సమావేశం జరిగింది. స్థానికులు ఈ దాడి వీడియోను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా... సోషల్ మీడియాలో అది వైరల్గా మారింది.
రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలో అనవసరంగా ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారనే వాదన వినిపిస్తోంది. స్థానికంగా ఉండే ఓ హిందూ కుటుంబానికి,ఓ ముస్లిం కుటుంబానికి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ గొడవల్లో తలదూర్చిన భజరంగ్ దళ్ కార్యకర్తలు... బలవంతపు మత మార్పిడిలు చేస్తున్నారంటూ ఆ ముస్లిం కుటుంబంపై ఆరోపణలు చేశారు. ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో ఆ ముస్లిం కుటుంబానికి బంధువైన రిక్షావాలాపై దాడి జరిగింది. దీంతో దాడి చేసింది భజరంగ్ దళ్ కార్యకర్తలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఇప్పటివరకూ ఆ సంస్థ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.