సివిల్ కోడ్ అమలు ప్రయత్నాలపై ముస్లిం లా బోర్డు ఆగ్రహం-అర్ధరాత్రి భేటీ-కీలక నిర్ణయం..
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ నిన్న మధ్యప్రదేశ్ లో ఉమ్మడి పౌరస్మృతికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ దేశం రెండు చట్టాలపై ముందుకు సాగలేదంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. వీటిపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీ కామెంట్స్ పై నిన్న ఆర్ధరాత్రి సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు సుదీర్ఘంగా చర్చించింది.
భారత్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసరంగా భేటీ అయింది. ప్రధాని మోదీ నిన్న భోపాల్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒకే దేశంలో రెండు చట్టాలు పని చేయవని, రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను ప్రస్తావిస్తున్నదని, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఏకరీతి చట్టాలను కోరుతున్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ముస్లిం లాబోర్డు చర్చించింది.

దాదాపు మూడు గంటల పాటు ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రధాని వ్యాఖ్యలపై చర్చించింది. దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలను వారు చర్చించారు. న్యాయవాదులు, నిపుణులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని లా కమిషన్కు తమ అభిప్రాయాలను సమర్పించాలని ముస్లిం లాబోర్డు నిర్ణయించింది. ప్రభుత్వం త్వరలో ముసాయిదా బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఇందులో భాగస్వాముల అభిప్రాయాలను కోరుతూ లా కమిషన్ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో లా కమిషన్ కు తమ అభిప్రాయాలు చెప్పాలని ముస్లిం పర్సనల్ లాబోర్డు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశంలోని ప్రతి ఒక్కరికీ వర్తించే మతం-ఆధారిత వ్యక్తిగత చట్టాలు, వారసత్వం, దత్తత, వారసత్వ నియమాలను నిర్దేశిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారతదేశ భూభాగం అంతటా ఒకే విధమైన పౌర కోడ్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications