మణిపూర్: మీటీలే ఫస్ట్.. ముస్లింలు నెక్ట్స్.. ఇదీ బీజేపీ స్టైల్
ఒక జాతి, ఒక ప్రజ, ఒక మతం అనే నినాదంతో ముందుకొస్తున్న బిజెపి తనదైన శైలిలో ఎన్నికల రాజకీయాలు చేస్తోంది.
ఇంఫాల్/గౌహతి: ఒక జాతి, ఒక ప్రజ, ఒక మతం అనే నినాదంతో ముందుకొస్తున్న బిజెపి తనదైన శైలిలో ఎన్నికల రాజకీయాలు చేస్తోంది. ప్రస్తుతం వచ్చేనెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మణిపూర్ రాష్ట్రంలో తమ పార్టీలోని ముస్లిం నేతలకు టిక్కెట్లు ఇవ్వ నిరాకరిస్తోంది. 18 అసెంబ్లీ స్థానాల్లో వివిధ పార్టీల విజయావకాశాలను ప్రభావితంచేసే స్థాయిలో ముస్లింల ఓటుబ్యాంక్ గణనీయంగా ఉంది.
చివరకు బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడికి కూడా టిక్కెట్ లభించలేదు. తనకు పార్టీ నాయకత్వం టిక్కెట్ నిరాకరించడంతో బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ సలాంఖాన్ తన అసంత్రుప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండానే బిజెపిలో టిక్కెట్ల కేటాయింపు జరుగుతోందని, కానీ రాష్ట్ర, కేంద్ర పార్టీ నాయకత్వానికి తగదన్నారు.
తమకు ఎందుకు టిక్కెట్లు నిరాకరించారో పార్టీ నాయకత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అహ్మద్.. 2014లో బిజెపిలో చేరారు. తనకు బదులు కేవలం రెండు నెలల క్రితం పార్టీలో చేరిన వారికి టిక్కెట్ కేటాయించారని సలాంఖాన్ ఆక్షేపించారు.
అంత మందిలో ఒక్కరికే ఛాన్స్
రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల నుంచి 17 మంది ఆకాంక్షాపరులు పార్టీ నాయకత్వానికి తమ ఆకాంక్షలు తెలియజేసినా.. అదేమీ తెలియనట్లే వ్యవహరిస్తున్నారు కమలనాథులు. ముస్లింల జనాభా అధికంగా గల ఈ రాష్ట్రంలో బిజెపి నాయకత్వం ప్రధానంగా మీటీలను మచ్చిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది. 17 మంది దరఖాస్తుల్లో లీలాంగ్ స్థానం నుంచి మహ్మద్ అన్వర్ హుస్సేన్ అనే నాయకుడుకి మాత్రమే టిక్కెట్ ఇచ్చారు. కైరావో, వాబ్గాయి, వాంగ్ఖెమ్ స్థానాల్లో ముస్లింల జనాభా గణనీయ స్థాయిలో ఉన్నా బిజెపి నాయకత్వం మాత్రం మీటీలకే టిక్కెట్లు కేటాయించింది. 60 స్థానాల అసెంబ్లీలో 31 స్థానాలకు బిజెపి టిక్కెట్ల కేటాయింపు పూర్తిచేసింది. తదుపరి జాబితా ఒకటి, రెండు రోజుల్లో వెలువడుతుందని భావిస్తున్నారు. ఖెత్రిగావో స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ బ్యూరోక్రాట్ ఎఆర్ ఖాన్ భవితవ్యం కూడా త్వరలో తేలిపోనున్నది.
కారణాలు చెప్పాలన్న సలాం ఖాన్
రాష్ట్రంలోని ముస్లింలకు టిక్కెట్లు కేటాయించడంపై బిజెపి నాయకత్వ వైఖరిపై ప్రజలకు తెలియజేయడం కష్ట సాధ్యంగానే ఉంటుందని, కనుక పార్టీలో కొనసాగాలా? వద్దా? తేల్చుకోవాలా? అన్న పరిస్థితి ఏర్పడిందని పార్టీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సలాంఖాన్ చెప్పారు.. 18 స్థానాల్లో ముస్లింల జనాభా గణనీయంగా ఉంటే కేవలం ఒక్క స్థానాన్నికేటాయించడం ద్వారా మణిపూర్ వాసులకు ప్రత్యేకించి ముస్లింలకు బిజెపి నాయకత్వం పంపే సందేశమేమిటని ప్రశ్నించారు. కానీ ఈ వాదనను బిజెపి నాయకత్వం నిరాకరిస్తున్నది. గెలుపే ప్రాధాన్యంగా టిక్కెట్లు కేటాయిస్తున్నామని బిజెపి అధికార ప్రతినిధి ఓ జాయ్ వ్యాఖ్యానించారు. టిక్కెట్ల కేటాయింపులో కాషాయీకరణే లేదన్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో పూర్తిస్థాయి పరివర్తన కోసం గెలుపొందే అవకాశాలు గల నేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
సవం కుంజాకేశ్వర్ గుడ్బై
టిక్కెట్ నిరాకరణతో బిజెపికి మాజీ ఎమ్మెల్యే సపం కుంజాకేశ్వర్ సింగ్ అలియాస్ సపం కేబా పార్టీకి రాజీనామా చేశారు. పట్సోయి స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన తల పోశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన సపం కేబా.. 2014 నుంచి రాష్ట్రంలో పార్టీ అభ్యున్నతి కోసం తాను పడ్డ కష్టాన్ని తిరిగి బిజెపి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇంఫాల్ లో 2014లో ప్రధాని మోదీ బహిరంగ సభకు, పార్టీ కార్యాలయ పునరుద్ధరణకు భారీగా నగదు ఖర్చు చేసినా తనను పట్టించుకున్న వారే లేరన్నారు.
మోడీ మ్యాజిక్ పనిచేస్తుందా..
వచ్చేనెల అసెంబ్లీ ఎన్నికలు జరిగే మణిపూర్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఇబోబీసింగ్ సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత, ప్రధాని నరేంద్రమోడీ మ్యాజిక్ తమను గట్టెక్కిస్తాయని బిజెపి నేతలు తలపోస్తున్నారు. భారతదేశానికే మణిహారం వంటిదని అభివర్ణించిన భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నాయకత్వం గాంధీ కుటుంబ చరిస్మా, ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్కు అసలు సిసలు పరీక్ష ఎదురు కానున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హింసాత్మక ఆందోళనలు కొనసాగినా, నిరంతరం ఆర్దిక దిగ్బంధాలు వెంటాడినా ఇబోబీసింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందని చెప్తున్నారు. అదే సమయంలో ఇబోబీసింగ్ వంటి సీనియర్ నేతను ఎదుర్కొనే సత్తా గల నాయకుడు లేకపోవడం బీజేపీకి ఉన్న అతి పెద్ద బలహీనత అని అంటున్నారు.
ఇబోబీసింగ్కు ధీటైన నాయకుడేడీ...
దీనివల్ల మణిపూర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదుగుతుందన్న అవకాశాలు లేవు. 18 లక్షల మందికి పైగా ఓటర్లు గల మణిపూర్లో యునైటెడ్ నాగా కౌన్సిల్ సారథ్యంలోని బ్లాకెడ్ వల్ల ఆహార కొరత, ఇందనం, ఇతర నిత్యావసరాలు అందుబాటులో లేక సామాన్యులు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. దీనివల్ల మార్చి నాలుగో తేదీన తొలి దశ పోలింగ్ జరిగే నాగాల ప్రాంతంలో సిఎం ఇబోబిసింగ్ పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ ఎనిమిదో తేదీన ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ ఇబోబీసింగ్ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు, వేర్పాటు వాద సంస్థలకు మాస్టర్ స్ట్రోక్ వంటిదేనన్న అభిప్రాయం ఉంది. ఈ జిల్లాల ఏర్పాటు నిర్ణయం వల్లే అధికార కాంగ్రెస్ పార్టీపై గల ప్రభుత్వ వ్యతిరేకత కొంత తగ్గుముఖం పట్టే అవకాశమున్నదని తెలుస్తోంది.
ఆమె పోటీ చేస్తారా...
కుకి చిన్ గిరిజనులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినందుకు నిరసనగానే ఇబోబీసింగ్కు వ్యతిరేకంగా నాగా వేర్పాటు వాద సంస్థ యూఎన్సీ సుదీర్ఘ ఆర్థిక దిగ్బందానికి పిలుపునిచ్చింది. ఇటీవలే పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ అనే పేరుతో కొత్త పార్టీ స్థాపించిన మణిపూర్ మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిలా చాను.. అధికార కాంగ్రెస్ పార్టీపై పోటీకి సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యేకించి మూడుసార్లు సిఎంగా ఉన్న ఇబోబీసింగ్ పైనే ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో సీరియస్ పాత్ర పోషించగల సామర్థ్యం గల నేత అని విశ్లేషకులు అంచనా వేయడం లేదు. కాకపోతే ఆమె పోటీచేసిన స్థానంలో భారీగా మానవ హక్కుల కార్యకర్తలు ప్రచారానికి దిగే అవకాశముంది.