ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే: ట్విట్టర్కు నూతన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: నూతన కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విని కుమార్.. మరు క్షణమే కేంద్ర చట్టాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్కు గట్టి హెచ్చరికలు చేశారు. ఈ నేలపై రూపుదిద్దుకున్న చట్టాలే అత్యున్నతమని, వాటిని పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
నూతన ఐటీ చట్టాలను ట్విట్టర్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో నివసించే, పనిచేసేవారు ఇక్కడి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. కాగా, రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అశ్విని వైష్ణవ్ బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు.

కేంద్రమంత్రిగా తనను నియమించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ ధన్యవాదాలు తెలిపారు. అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మాజీ సివిల్ సర్వీసెస్ అధికారి కావడం గమనార్హం. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్రమంత్రిగా అశ్విని వైష్ణవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐటీ శాఖతోపాటు ఆయన రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ పాటించేందుకు ట్విట్టర్ సుముఖత వ్యక్తం చేయని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం జరుగుతోంది. మాజీ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ట్విట్టర్కు పలుమార్లు హెచ్చరికలు చేసినా ట్విట్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతేగాక, రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను కొన్ని గంటలపాటు బ్లాక్ చేసింది.
Assumed the charge of Minister of Communications at Sanchar Bhawan today. pic.twitter.com/BPQYyDxNVG
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2021
Recommended Video
కాగా, గురువారం ఢిల్లీ హైకోర్టులోనూ ట్విట్టర్ కేసు విచారరణకు వచ్చింది. 8 వారాల్లోగా గ్రీవియన్స్ ఆఫీసర్ను నియమించనున్నట్లు ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ చట్టాలను పాటించడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించేందుకు ఇంకెంత సమయం కావాలని ప్రశ్నించింది. అంతేగాక, కావాల్సిన సమయం ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ దిగివచ్చింది.












Click it and Unblock the Notifications