2024 ఎన్నికలే మన టార్గెట్: 19 పార్టీలు పాల్గొన్న కీలక భేటీలో సోనియా గాంధీ నిర్దేశం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. తాజాగా, శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ఓ పద్ధతి ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సోనియా గాంధీ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీలను కోరారు.
దేశ ప్రయోజనాల కోసం మనమంతా ఒక్కతాటిపై నిలవాల్సిన సమయం వచ్చిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా ప్రయత్నాలుండాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మనమందరం పనిచేయాలని విపక్షాలకు సోనియా గాంధీ కోరారు.

ఇది మనందరికీ ఓ సవాలు లాంటిదే. మనమందరం కలిస్తే అది సాధ్యమవుతుంది. కలిసి కట్టుగా పనిచేసి 2024 ఎన్నికల్లో గెలుపొందాలని పార్టీ నేతలకు సోనియా తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలా మనమంతా కలిసి పనిచేయాలని సమావేశంలో పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తమ పోరాటం కొనసాగాలని అన్నారు.
మనందరి లక్ష్యం ఒక్కటే అయి ఉండాలని సోనియా గాంధీ 19 పార్టీలకు స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, వామపక్ష నేత సీతారాం ఏచూరి వర్చువల్గా పాల్గొన్నారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇక బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్, అకాలీదళ్ పార్టీల నేతలు ఈ సమావేశ జాబితా నుంచి తొలగించబడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియా గాంధీ విపక్షాలను సన్నద్ధం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము ఏ పార్టీనైనా కలుపుకుతామని సోనియా గాంధీ చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలన్ని కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేశాయి. పార్లమెంటు సమావేశాల్లో నిరసనలు, ఆందోళనలు చేయడంతో సభలు సజావుగా సాగలేదు. పెగాసస్ హ్యాకింగ్, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలన్నీ ఐకమత్యంగా పోరాడాయని సోనియా గాంధీ తెలిపారు. ఈ ఐకమత్యాన్ని 2024 ఎన్నికల వరకు కొనసాగించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దించాలని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్షాలన్నీ కలిసి పోరాటం కొనసాగించాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications