ఢిల్లీ ఎన్నికల్లో నా లెక్క తప్పింది: అమిత్ షా
ఎన్నికల రాజకీయంలో అపర చాణక్యుడిగా పేరుపొందిన అమిత్ షా వైఫల్యాన్ని తలుచుకుని మొట్టమొదటిసారి కుమిలిపోయారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం పార్టీని విజయపథంలో నడిపించిన.. కొత్త సారథి నాయకత్వాన్ని శంకించకుండానే ఫస్ట్ టైమ్ ఓటమిపై వివరణ ఇచ్చుకున్నారు. గురువారం టైమ్స్ నౌ సదస్సులో మాట్లాడిన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బొక్కబోర్లా..
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 45 సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తుందని ప్రచారం చివరిరోజు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే కేజ్రీవాల్ పార్టీతో పోరుకు సిద్ధమైన బీజేపీ.. జాతీయ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విద్వేషం హద్దులు దాటినట్లుగా భావించిన ఢిల్లీ ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా గమనించింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో 70 సీట్లకుగానూ 62 స్థానాలను గెలుచుకుని ఆప్ విజయఢంకా మోగించగా.. అధికారంలోకి వస్తామన్న బీజేపీ కేవలం 8 స్థానాల దగ్గరే బొక్కబోర్లా పడిపోయింది. అలా ఎందుకు జరిగిందో అమిత్ షా వివరించారిలా..
Recommended Video
లెక్క తప్పింది..
‘‘ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై నా లెక్క పూర్తిగా తప్పింది. ప్రజలకు బీజేపీ పట్ల విశ్వాసం సన్నగిల్లలేదని చెప్పడానికి మేం సాధించిన ఓట్ల శాతమే నిదర్శనం. అయితే మా పార్టీ నేతల దుందుడుకు వ్యాఖ్యల వల్ల తెలియకుండానే వ్యతిరేకత ఏర్పడింది. మా వాళ్లు ‘ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్'.. ‘గోలీమారో..' లాంటి నినాదాలు చేసి ఉండాల్సిందికాదు. సొంత తప్పిదాల వల్లే బీజేపీ గెలుపు అవకాశాల్ని జారవిడుచుకుంది''అని అమిత్ షా అన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీకి రిఫరెండం కాదు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), దేశవ్యాప్త ఎన్ఆర్సీకి రిఫరెండం కానేకాదని అమిత్ షా చెప్పారు. స్థానిక అంశాలపైనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆ విషయం తెలిసి కూడా కొందరు నేతలు అనవసర కామెంట్లు చేసి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారన్న ఆయన.. పరోక్షంగా అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, కపిల్ శర్మ తదితర నేతలపై మండిపడ్డారు. కాగా, నజఫ్ గఢ్ నియోజకవర్గంలో ప్రచార సమయంలో అమిత్ షా కూడా.. ఈవీఎంలో కమలం గుర్తుపై బటన్ నొక్కితే.. షాహీన్ బాగ్ కు కరెంట్ షాక్ తగలాలంటూ సీఏఏ వ్యతిరేక నిరసనకారుల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

చెమటోడ్చినా దక్కని ఫలితం..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మొత్తం 52 రోడ్ షోలు నిర్వహించారు. సుమారు 200 మంది ఎంపీలు, 11 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘దేశ ద్రోహుల్ని కాల్చిపారేయండి'అంటూ నినాదమిచ్చిన తర్వాతిరోజే షాహీన్ బాగ్ లో రాంభక్త్ గోపాల్ శర్మ అనే టీనేజర్ కాల్పులకు పాల్పడటం తెలిసిందే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను టెర్రరిస్టు అంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన కామెంట్లు, ఢిల్లీ ఎన్నికల్ని బీజేపీ అభ్యర్థి కపిల్ శర్మ.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చడం పార్టీకి తీవ్రంగా నష్టం చేశాయని సర్వత్రా వెల్లడైన అభిప్రాయాన్ని ఇప్పుడు అమిత్ షా కూడా నిర్ధారించారు. తాజా ఓటమితో ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 27 ఏళ్లపాటు బీజేపీ అధికారానికి దూరమైనట్లయింది.












Click it and Unblock the Notifications