నా జీవితం రైతులకు అంకితం.. చివరిశ్వాస వరకు వాళ్లకోసమే: అసెంబ్లీలో యడ్యూరప్ప భావోద్వేగం
యడ్యూరప్ప: రైతులు, దళితులు అందరూ సంతోషంగా జీవించాలని, రైతుల కోసం నా జీవితం అంకితం చేశానని విశ్వాస పరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప చెప్పారు.కర్ణాటకలో రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయని గుర్తుచేశారు.
ఎన్నికల్లో అధికార పార్టీపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారని అన్నారు. ఒకప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మా పార్టీకి ఇప్పుడు 104మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. తాను ప్రజల వద్దకు వెళ్లి వాళ్ల కష్ట సుఖాలు తెలుసుకున్నానని, వాళ్లతో మమేకమయ్యానని పేర్కొన్నారు.
రైతుల కోసం రూ.1లక్ష వరకు రుణమాఫీ చేయాలనుకున్నానని యడ్యూరప్ప అన్నారు. నా చివరి శ్వాస వరకు రైతుల కోసం పనిచేస్తానని ప్రమాణం చేశానని పేర్కొన్నారు. 'కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించారు. కర్ణాటకపై ఆయనెప్పుడూ వివక్ష చూపించలేదు. కర్ణాటక నిజాయితీ గల రాజకీయాన్ని కోరుకుంటోంది. కర్ణాటక ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా.. నా చివరి శ్వాస వరకు నేను వారికి సేవ చేస్తాను' అని యడ్యూరప్ప భావోద్వేగంగా చెప్పారు.
తమ పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల ఇంకా నమ్మకం ఉందని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28సీట్లు తామే గెలుస్తామని యడ్యూరప్ప చెప్పారు.