ఆకాశం నుంచి పడిన వింత వస్తువు, జనాల పరుగు
చెన్నై: తమిళనాడులో ఆకాశం నుంచి ఓ వింత వస్తువు కిందపడింది. ఈ వస్తువును చూసిన జనాలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దిండుగల్ జిల్లాలో బుధవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అది ఫ్లయింగ్ సాసర్ అంటూ పుకార్లు రేగడంతో దానిని చూసేందుకు ఆ తర్వాత జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు.
బుధవారం ఉదయం మోతుపట్టి అనే గ్రామంలో రంగస్వామి అనే రైతు తన పొలంలో టమోటాలు తెంపుతున్నాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి వింతైన వస్తువు భూమి పైకి దూసుకు రావడం గమనించాడు. ఆది కాస్త దూరంలో పడింది. భారీ శబ్దం వినిపించింది.
అక్కడ పొగ కమ్ముకుంది. భయానికి గురైన అతను అక్కడి నుంచి పరుగు పెట్టాడు. వెంటనే అతను కల్లిమండియం పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత విషయం తెలిసి గ్రామస్తులు అక్కడకు తరలి వచ్చారు.
కొందరు దానిని ముట్టుకొని చూశారు. దానిని ముట్టుకుంటే చాలా దృఢంగా ఉందని సురేష్ అనే గ్రామస్తుడు చెప్పాడు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ అధికారులు దానిని పరిశీలిస్తున్నారు. కాగా, ఇది జెట్ ప్లేన్ నుంచి పడిన ఏదైనా వస్తువు కావొచ్చునని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, కరూర్ జిల్లా గౌండపాళయంలోని రైతు కుళందై స్వామి ఇంటి సమీపంలో కూడా సాయంత్రం పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పది కిలోల బరువు ఉన్న గుండ్రటి ఇనుప రేకు కనిపించింది. దానిని చూసి జనాలు భయపడ్డారు.