రైలు ఢీకొని టెక్కీ మృతి: ప్రియురాలిపై అనుమానాలు!
పోలీసుల కథనం ప్రకారం.. సాల్ట్ లేక్లో నివాసం ఉండే సుమన్ దాస్ తన ప్రియురాలును కలిసేందుకు ఆదివారం సాయంత్రం జాదవ్పూర్ వెళ్లాడు. ఆ తర్వాత తన ప్రియురాలుతోపాటు బఘాజతిన్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో స్పీడుగా వచ్చిన రైలు సుమన్ దాస్ను ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అతని ప్రియురాలు మాత్రం తనను తాను రక్షించుకుంది. ఈ విషయాలను స్వయంగా మృతుడు సుమన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది.
ఈ ప్రమాదం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందని సుమన్ ప్రియురాలు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సుమన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమవారం సుమన్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు అతని పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
సుమన్ కుటుంబ సభ్యులను కూడా ఈ ఘటనపై పోలీసులు విచారించారు. కాగా సుమన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు రాతపూర్వకమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సుమన్ మరణంపై తమకు అనుమానాలున్నాయని, ఈ కేసులో తమకు సహాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు తమను కోరారని పోలీసులు పేర్కొన్నారు.