ఈశాన్య అభివృద్ధికి మేలు: ఒప్పందంపై మోడీ
న్యూఢిల్లీ: నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్ఎస్సిఎన్)ఐఎం వర్గంతో ‘విజయవంతం'గా జరిగిన చర్చలు కేవలం నాగాలాండ్ అభివృద్ధికి మాత్రమే కాకుండా మొత్తం ఈశాన్య ప్రాంతమంతటికీ మేలు చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సమష్ఠిగా ప్రారంభమైన ఈ నూతన పయనం యావత్ దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని ఉద్ఘాటించారు.
నాగాలాండ్లో శాంతి, సుస్థిరతలను పాదుకొల్పడంలో గతంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు గతంలో ప్రతి ఒక్కరూ కృషి చేశారని, అందరి ప్రయత్నాల వల్లనే ఎన్ఎస్సిఎన్(ఐఎం) నేతలతో చర్చలు విజయవంతమయ్యాయని, కనుక ఈ ఘనత మాదేనని తమతోపాటు ఏ ప్రభుత్వమూ చెప్పుకోలేదని ఆయన అన్నారు.
భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన నాగా ఆధ్యాత్మిక నాయకురాలు రాణీ గైదిన్లియు శత జయంతి సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టేందుకు ఎంతోమంది పోరాటయోధులు తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ వారందరికీ సమాన గౌరవం దక్కలేదని ప్రధాని మోడీ అన్నారు.
రాణీ గైదిన్లూ ఈశాన్య ప్రాంతంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు దేశం కోసం సుదీర్ఘకాలం జైల్లోనే గడిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం నాగాలాండ్లోనే కాకుండా యావత్ ఈశాన్య ప్రాంతంతోపాటు దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కాంక్షిస్తూ సాధారణ స్రవంతిలో చేరుతున్నారని అన్నారు.
ఇప్పుడే ప్రారంభమైన ఈ సమష్టి ప్రయాణం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని, దేశం మరిన్ని సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్ఎస్సిఎన్ (ఐఎం)కు మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఈశాన్య భారతావనిలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కనెక్టివిటీ సమస్య పరిష్కారమైతే ఇక అభివృద్ధికి సమస్య ఉండదని, అందుకే ఈశాన్య రాష్ట్రాల రాజధానుల మధ్య రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
నాగాలాండ్లో పైనాపిల్, మిర్చి పంటలు అధికంగా పండుతున్న విషయాన్ని మోడీ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఈశాన్య ప్రాంతం దేశానికి ‘సేంద్రియ రాజధాని' (ఆర్గానిక్ క్యాపిటల్) కాగలదని అన్నారు.
దేశ అభివృద్ధికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నాగాలాండ్ గవర్నర్ పిబి ఆచార్య, నాగాలాండ్, మణిపూర్ ముఖ్యమంత్రులు టిఆర్ జెలియాంగ్, ఓ ఇబోబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.