నాగ్పూర్ అపార్ట్మెంట్లో భారీ ఎత్తున బయటపడ్డ నల్లధనం
నాగ్పూర్ : పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో దేశంలో ముక్కి మూలుగుతున్న నల్లధనం కుప్పలు తెప్పలుగా బయటపడుతోంది. రోడ్ల మీద, పాల ట్యాంకర్లలో, చెత్త కుప్పల్లో నల్లధనం నోట్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా నాగ్పూర్ లోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్ లో భారీ ఎత్తున నల్లధనం బయటపడింది.
నాగ్పూర్ లోని హిల్టాప్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో భారీగా నల్లధనం నిల్వలు ఉన్నట్టు పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించారు. దీంతో ఓ ట్రావెల్ బ్యాగులో నిల్వ ఉంచిన భారీ నల్లధనం బయటపడింది. రూ.వెయ్యి నోట్ల కట్టలు దాదాపు రూ.1.72కోట్లు, రూ.500 నోట్ల కట్టలు రూ.15.5లక్షల దాకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నల్లధనానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో ఓ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్టు అనంతరం డబ్బు వివరాలను ఐటీ శాఖకు అందజేసినట్టు తెలియజేశారు.