పాక్ స్పందనపై ఆందోళన వద్దు: రిజిజు, వారిని శిక్షించాలి: ఐక్య రాజ్య సమితి
న్యూఢిల్లీ: యూరి సెక్టార్లో ఉగ్రదాడి, వీరజవాన్ల మృతి విషయమై పాకిస్తాన్ స్పందించిన తీరుపై ఆందోళన వద్దని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోమవారం అన్నారు. పాక్ స్పందన పైన మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జరిగేదంతా అందరూ చూస్తున్నారన్నారు. భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు.
జమ్ము కాశ్మీర్ సీఎం నివాళి
యూరీ సెక్టార్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అటు అమరవీరులకు జమ్మూకశ్మీర్ ముఖ్యముంత్రి మెహబూబా మూప్తీ నివాళులర్పించారు. మృతుల్లో ఎక్కువ మంది బీహారీలు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
యూరీ సెక్టార్లో దాడుల నేపథ్యంలో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. 26 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి అని, ముష్కరమూకల ఏరివేతకు భారత సైన్యం సరిహద్దులు దాటక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయిన కొందరు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
ప్రధాని అధ్యక్షతన సమీక్ష
ప్రధాని మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం సమావేశమైంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్మీచీఫ్ దల్బీర్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ దూకుడు పెంచింది. పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాక్కు అదే స్థాయిలో బుద్ధి చెబుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిని చేసింది. అంతేకాదు పొరుగు సేనలకు భారత్ తూటాలతోనూ గట్టి సమాధానం చెబుతోంది.
ఒక్క తూటా మీ వైపు నుంచి వస్తే వంద బుల్లెట్లతో సమాధానం చెబుతామన్న ప్రధాని మోడీ మొదలుకొని రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వరకు అందరిదీ అదే మాట. పాకిస్తాన్ విషయంలో మారిన భారత్ వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది.
భద్రతా దళాలకు తగినంత స్వేచ్ఛ కలిగిస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తూటాల వర్షం కురిపించాలంటూ ఉన్నతాధికారుల నుంచి భధ్రతాదళాలకు ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు, కశ్మీర్ అంశంపై బిజెపి దూకుడు పెంచింది. తమ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో బెలూచిస్తాన్ వ్యవహారాన్ని ప్రస్తావించడం ద్వారా చెప్పకనే చెప్పారు.
ఖండించిన ఐక్యరాజ్య సమితి
జమ్మూ కాశ్మీర్లోని ఉరీలో భారత సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలన్నారు. మరింత ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.