కఠిన నిర్ణయాలే.. తప్పదు, మొదట ద్వేషించినా..: మోడీ
న్యూఢిల్లీ: దేశ ప్రగతి కోసం రానున్న ఒకటి రెండేళ్లు గట్టి చర్యలు తప్పవని, ప్రజలు తొలుత నిరసించినా తర్వాత అర్థం చేసుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. జాతి ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తప్పదన్నారు. ఆర్థిక పరిస్థితి బాగు చేయడానికి తప్పనిసరి కొన్ని వర్గాలకు ఇవి రుచించక పోవచ్చునన్నారు. తనను ప్రేమించేవాళ్లే ద్వేషించవచ్చు.. కానీ విషయం తెలిశాక మళ్లీ ప్రేమిస్తారని చెప్పారు.
మోడీ భజనతో ఉపయోగం ఉండదన్నారు. యువత నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాష్ట్రాల ప్రగతితోనే దేశ ప్రగతి సాధ్యమని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు రాబోయే ఒకటి రెండేళ్లలో కఠిన నిర్ణయాలు తీసుకోనున్నామని మోడీ చెప్పారు.
ప్రధాన మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టేనాటికి మునుపటి యూపీఏ ప్రభుత్వం ఏమీ మిగల్చలేదని, ఖజానానే కాదు.. మొత్తంగా ఖాళీ చేసేసిందని, దేశ ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారిందని, దీనిని మళ్లీ గాడిలో పెట్టడానికి రాబోయే ఒకటి రెండేళ్లలో కఠిన నిర్ణయాలు, పటిష్ఠ చర్యలు తీసుకోక తప్పదన్నారు. తాత్కాలికంగా చూస్తే.. ఆ చర్యలు ప్రతి ఒక్కరికీ రుచించక పోవచ్చునని చెప్పారు.
ఆ చర్యలతో దేశ ప్రజలు నాపై కురిపించిన ప్రేమకు గండి పడుతుందని కూడా తనకు తెలుసునని కానీ, దేశ ఆర్థిక పరిస్థితిని మళ్లీ గాడిలో పెట్టడానికే తాను ఆ చర్యలు తీసుకున్నానని తెలిసిన తర్వాత మళ్లీ వాళ్లంతా తనను ప్రేమిస్తారన్నారు. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశమే లేదన్నారు. గోవా పర్యటనలో ఉన్న ఆయన శనివారం పనాజిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
మోడీని, బిజెపిని కీర్తించడం ద్వారా దేశానికి మనమేమీ మేలు చేసినట్లు కాదని, మోడీకి భజన చేయడం ద్వారా పరిస్థితి మెరుగుపడుతుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. జాతి ప్రయోజనాలను కాపాడడానికి కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని ఆ తర్వాత మోడీ ట్వీట్ చేశారు.
కాగా, నైపుణ్యం, ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని వెల్లడించారు. స్కిల్ను పెంచడానికి, ఎంటర్ప్రెన్యూర్షిప్ను వృద్ధి చేయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖనే సృష్టిస్తున్నామని, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా పెద్దపీట వేస్తున్నాయని, దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్లలోపు యువకులేనని, నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తే భారత్లోనే కాదు.. విదేశాల్లో కూడా నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.