నరేంద్ర మోడీ చేసింది నేరమే, కానీ ఆలస్యమైంది!: కోర్టు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీకి 2012లో జరిగిన ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి వివరాలను వెల్లడించకుండా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి నరేంద్ర మోదీ నేరానికి పాల్పడ్డారని అహ్మదాబాద్ కోర్టు పేర్కొంది. అయితే, ప్రస్తుతం మోడీపై కేసు నమోదు చేయమని తాము ఆదేశించలేమని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎంఎం షేక్ సోమవారం చెప్పారు.
పెళ్లి వివరాలు దాచిపెట్టినందుకు మోడీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత నిశాంత్ వర్మ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇది విచారణార్హమైనది కాదంటూ కోర్టు తోసిపుచ్చింది.
ఈ విషయంలో వాస్తవాలు వెల్లడించకుండా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125-ఏ(3)ను ఉల్లంఘించి మోడీ నేరానికి పాల్పడ్డారని, అయితే ఈ సెక్షన్ను ఉల్లంఘించిన కేసుల్లో నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ 468(2)(బి) ప్రకారం ఏడాదిలోగా ఫిర్యాదు చేయాలని కానీ, ఈ నేరానికి పాల్పడిన 16 నెలల తర్వాత ఫిర్యాదు చేస్తున్నారని, దీన్ని పరిగణనలోకి తీసుకోలేమని, ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించలేమని కోర్టు తీర్పు చెప్పింది.