గుజరాత్ సీఎం త్యాగం: మోడీ పాలనే కారణం, రాహుల్
న్యూఢిల్లీ: నరేంద్ర మెడీ 13 ఏళ్ల పాలన కారణంగానే ఇప్పుడు గుజరాత్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదే సమయంలో బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.
గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ ను బలిపశువు చేశారని ఆరోపించారు. ఆనందీబెన్ పాలన నేడు గుజరాత్ లో ఉద్రిక్త పరిస్థితులు కారణం కాదని, ఆమె కేవలం రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు.
గుజరాత్ లో నేడు ఉన్న పరిస్థితులకు నరేంద్ర మోడీ 13 ఏళ్ల పాలనే కారణం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఆనందీబెన్ బీజేపీ అధిష్టానాన్ని కోరిన నేపధ్యంలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే విషయంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నాయకుల మీద విమర్శలు చేశారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆనందీ బెన్ రాజీనామా చేశారని శంకర్ సిన్హా వాఘేలా ఆరోపించారు.
2017లో గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయని, అప్పుడు బీజేపీకి ఓటమి తప్పదని సంకేతాలు రావడం వలనే ఆనందీబెన్ ను ఆ పదవి నుంచి తప్పించారని సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహమ్మద్ పటేల్ ఆరోపించారు.