ఉక్కు మనిషి తుప్పుగా..: మోడీ అభ్యర్థిత్వంపై నితీష్
పాట్నా/న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక కావడంపై బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్య నేత నితీష్ కుమార్ సోమవారం విభిన్నంగా స్పందించారు. మోడి ఎంపిక ద్వారా ఉక్కు మనిషి అద్వానీ తుప్పుగా వదిలేశారని విమర్శించారు. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బిజెపి ఒంటరిగా మిగిలిపోతుందన్నారు.
దేశంలో కాంగ్రెసు, యూపిఏ వ్యతిరేక మూడ్ను బిజెపి తగ్గించిందని ఆరోపించారు. ఈ ప్రకటన ద్వారా(మోడీని ప్రధాని అభ్యర్థిగా) బిజెపికి ఎలాంటి లబ్ధి చేకూరేది లేదన్నారు. అద్వానీ అందరికీ లోహ పురుష్(ఐరన్ మ్యాన్)గా తెలుసునని, ఆ పార్టీ ఆయనను తుప్పుగా వదిలేశారని, కొత్త ఉక్కు మనిషి కోసం వెతుకుతున్నారని విమర్శించారు.
బీహార్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామన్న జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఇప్పటి వరకు తాము ఏ పార్టీతోను చర్చలు జరపలేదన్నారు. పరిస్థితులను బట్టి తాము ఇతర పార్టీలతో చర్చిస్తామన్నారు.
మోడికి అస్సాం సిఎం ప్రశ్న
మోడీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక కావడంపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందించారు. ఆయన ట్విట్టర్లో మోడీ సెక్యులరిజాన్ని ప్రశ్నించారు. మాజీ మంత్రి కోద్నాని గుజరాత్ అల్లర్లలో ఇన్వాల్వ్ అయ్యారని, అలాంటప్పుడు మోడీ లౌకికవాదం ఎక్కడుందని ప్రశ్నించారు.