మళ్లీ పుట్టి గాంధీని మళ్లీ చంపుతానన్నాడు: హరిహర సింగ్
రాంచీ: ‘నేను హిందువును. నాకు పునర్జన్మపై నమ్మకముంది. గాంధీ హత్య కేసులో నన్ను మీరు ఉరితీసినా..వచ్చే జన్మలో గాంధీతో పాటే నేనూ పుడతాను. అప్పుడూ నేనే గాంధీని చంపుతాను' అని నాథూరాం గాడ్సే అన్నట్లు బాబూ హరిహర సింగ్ తెలిపారు. గాంధీజీ హత్య కేసు విచారణ సందర్భంగా నాథూరాం గాడ్సే చెప్పిన ఈ మాటలను బీహార్కు చెందిన 96 ఏళ్ల బాబూ హరిహర్ సింగ్ శుక్రవారం వెల్లడించారు.
మహాత్ముడిని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను 45రోజుల పాటు ప్రశ్నించిన ఆరుగురు సభ్యుల బృందంలో సింగ్ కూడా ఒకరు. ఆయన 1977లో పదవీ విరమణ చేశారు. నాటి బృందంలోని సభ్యులలో ప్రస్తుతం ఆయనొక్కరే జీవించి ఉన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా మీడియాతో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు.
1948 జనవరి 30వ తేదీన గాంధీని గాడ్సే హత్య చేసిన విషయం తెలిసిందే. తన వయస్సు కారణంగా హరిహర సింగ్ ఏమీ మరిచిపోయినట్లు లేరు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో గాడ్సేను సిఐడి అధికారులు ప్రశ్నించిన వైనాన్ని ఆయన వివరించారు. ‘నేను హిందువును. నాకు పునర్జన్మపై నమ్మకం ఉంది. నన్ను ఉరి తీస్తే నేను అర్థాంతరంగా మరణిస్తాను. తిరిగి జన్మించే వరకు నేను స్ఫూర్తిగా ఉంటాను. గాంధీతో పాటు నేను తిరిగి జన్మించాలని భగవంతుడిని కోరుకుంటాను. దానివల్ల తిరిగి నేను గాంధీని చంపగలను' అని గాడ్సే అన్నట్లు ఆయన వివరించారు.
ఇన్స్పెక్టర్ మనోహర్ ఝా నేతృత్వంలోని ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు,, ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (సింగ్), ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన బృందం 45 రోజుల పాటు గాడ్సేను ప్రశ్నించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన సిఐడి బృందాలున్నాయని, వొర్లిలోని సైనిక బ్యారెక్లో ఉండి గాడ్సేను 45 రోజుల పాటు ప్రశ్నించాయని హరిహర సింగ్ చెప్పారు.
పంజాబ్, మద్రాసు, మధ్య భారత్, ఢిల్లీ, తదితర రాష్ట్రాల నుంచి సిఐడి బృందాలను రప్పించి ప్రశ్నించడానికి కారణం గాడ్సేకు వివిధ రాష్ట్రాలతో ఉన్న సంబంధాలను కనిపెట్టడానికేనని అన్నారు. గాడ్సే దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరంచాడని, తాను చేసినదానికి గాడ్సే విచారం ప్రకటించలేదని, తాను చేసిన దాన్ని చాలా నిజాయితీగా అంగీకరించాడని ఆయన వివరించారు
గాంధీని ఎందుకు ద్వేషించావని అడిగితే - ‘సన్యాసిగా నేను ఆయనను (గాంధీని) గౌరవించేవాడిని. ఎందుకంటే ఆయన ఎల్లవేళలా సత్యమే చెప్పాడు. అది అంత సులభం కాదు. కానీ ఆయన విఫల రాజకీయ నేత' అని అన్నట్లు హరిహర సింగ్ చెప్పారు.