లష్కర్ కుట్ర: సౌదీలో సభకు బెంగళూరు వైద్యులు
బెంగళూరు: కర్ణాటకలోని ఓ వర్గంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులను హత్య చెయ్యడానికి ఉగ్రవాదులతో కలిసి బెంగళూరుకు చెందిన ఇద్దరు వైద్యులు ప్లాన్ వేశారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు.
ఇదే విషయాన్ని కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్న ఎన్ఐఏ ప్రత్యేక బృందం అధికారులు ఆ ఇద్దరు డాక్టర్ల మీద నిఘా వేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు బెంగళూరు సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది అసాదుల్లా ఖాన్ ను విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నారు.
ప్రముఖులను హత్య చెయ్యడానికి జరిగిన కుట్రలో ఇద్దరు వైద్యులు పాల్గోన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. బెంగళూరు సీసీబీ పోలీసులు 12 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన తరువాత ఈ విషయాలు వెలుగు చూశాయి.
కర్ణాటకతో పాటు తెలంగాణ, మహారాష్ట్రలోని పలువురు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలు సాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. మూడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.
కర్ణాటకలో ముస్లీంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులను, ముస్లీంలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పాత్రికేయులను అంతం చెయ్యాలని 2012లో సౌదీ అరేబియాలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు కుట్రపన్నారు.
ఆ సమావేశంలో బెంగళూరుకు చెందిన ఇద్దరు వైద్యలు పాల్గోన్నారని అసాదుల్లా ఖాన్ ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ఇద్దరు వైద్యులతో పాటు మహమ్మద్ ఫైసల్ అనే ఇంజనీరు ఆ సమావేశంలో పాల్గోన్నాడని అసాదుల్లా ఖాన్ వివరించాడు.
కేసు విచారణలో ఉన్నందున ఉగ్రవాదులు హత్య చెయ్యడానికి ప్రయత్నించిన రాజకీయ నాయకులు, పాత్రికేయుల పేర్లు వెల్లడించడానికి వీలుకాదని పోలీసు అధికారులు అంటున్నారు. డిసెంబర్ 9వ తేదిన అసాదుల్లా ఖాన్ ను హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు.