ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికో తెలుసా? ఆయన పేరును ప్రకటించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.. ఇందిరాగాంధీ శాంతి అవార్డు. ప్రముఖ పర్యావరణ వేత్తకు ఈ అవార్డు వరించింది. ఆయనే సర్ డేవిడ్ ఆటెన్ బరో. ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి జ్యూరీకి నాయకత్వం వహించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆయన పేరును ప్రకటించారు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ అధికారికంగా వెల్లడించింది.
ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ ఆటెన్ బరో 1926లో జన్మించారు. పర్యావరణరంగంలో కృషి చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన గాంధీ మూవీలో టైటిల్ రోల్ లో నటించిన రిచర్డ్ ఆటెన్ బరో.. ఆయన సోదరుడే. వందమంది అత్యుత్తమ బ్రిటన్ దేశీయుల్లో డేవిడ్ కు స్థానం దక్కింది. వన్యప్రాణులు, క్రిములు, కీటకాలపై బీబీసీలో అనేక డాక్యుమెంట్లను ఆయన స్వయంగా చిత్రీకరించారు. పర్యావరణ వేత్తగా తాను చేసిన కృషికి ఇప్పటికే డజనుకు పైగా అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారాయన.
తాజాగా ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. వచ్చేనెల న్యూఢిల్లీలో నిర్వహించే కార్యక్రమం సందర్భంగా డేవిడ్ ఆటెన్ బరోకు అవార్డును అందజేయనున్నట్లు ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ కార్యదర్శి సుమన్ దుబే వెల్లడించారు. బయో డైవర్శిటీని పరిరక్షించడంలో డేవిడ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన జీవితం మొత్తం వన్యప్రాణుల సంరక్షణకే అంకితం చేశారని, అందుకే ఆయన పేరును ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు.