లాక్డౌన్ వేళ.. ఆస్పత్రుల నిరాకరణ: వైద్యం అందక న్యాయవాది మృతి
ముంబై: లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ వైద్యానికి సంబంధించిన సేవలు, వైద్యం కోసం వెళ్లేవారికి పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల వాహనాలు లేక, మరికొన్ని చోట్ల సాధారణ వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా, ముంబైలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను రెండు ఆస్పత్రులు చేర్చుకోలేదని, దీంతో ఆయన మృతి చెందారని నవీ ముంబైకి చెందిన లాయర్ దీపాలి కన్నీటిపర్యంతమయ్యారు. నవీ ముంబైలోని వషీ ప్రాంతంలో నివసించే లాయర్ జైదీప్ జయ్ పంత్(56)కు ఏప్రిల్ 14న గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తే.. అక్కడ సెక్యూరిటీ గార్డు కనీసం గేటు కూడా తీయలేదని దీపాలి తెలిపారు.
కరోనా బాధితులనే చేర్చుకుంటామని, మరే ఇతర ఎమర్జెన్సీ కేసులను కూడా చేర్చుకోమని చెప్పిపంపించారని చెప్పారు. ఆ తర్వాత మరో ఆస్పత్రి తీసుకెళ్లినా అక్కడ కూడా అనుమతించలేదని తెలిపారు. ఈ క్రమంలో 30 నిమిషాలు అంబులెన్స్ లో ప్రయాణించి నెరూల్ లోని డీవై పాటిల్ ఆస్పత్రికి తీసుకెళితే.. అప్పటికే తన భర్త మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని దీపాలి కన్నీటిపర్యంతమయ్యారు.
Recommended Video
లాక్డౌన్ సమయంలో కరోనా కేసులు తప్ప మరే ఇతర ఎమర్జెన్సీ కేసులు తీసుకోరా? అంటూ న్యాయవాది ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పేషంట్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు స్థానికులకు నిత్యావసరాలు అందించడానికి తన భర్తే అందరకన్నా ముందు స్పందించారని.. అలాంటి వ్యక్తికే సరైన సమయంలో సహాయం అందలేదని వాపోయారు. ఇలాంటి సమయంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో తన భర్తను చేర్చుకోని ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయవాది దీపాలి.