రూ.25వేల కోట్ల బ్యాంక్ స్కాంలో శరద్ పవార్ సోదరుడి కొడుకు
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్కు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో శరద్ పవార్ పేరు ఉండటంతో విచారణ జరుపుతోంది ఈడీ.
మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో శరద్ పవార్ పేరును నిందితుడిగా పేర్కొనకపోయినప్పటికీ.. ఆయన సోదరుడి కుమారుడి పేరును ఈడీ నమోదు చేసింది. రూ. 25వేల బ్యాంకు కుంభకోణంలో అతని పేరు నమోదు కావడం గమనార్హం.
అక్రమంగా లోన్లు ఇవ్వడం ద్వారా ఈ కుంబకోణానికి పాల్పడ్డారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది జరగడం తమకు పెద్ద షాకింగ్ ఏమీ కాదని, దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోందని అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్ వ్యాఖ్యానించారు. మేమంతా దీనికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు.
గత నెలలో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసు విభాగమైన ఎకనామిక్ అఫెన్స్ వింగ్.. శరద్ పవార్, అజిత్ పవార్ లతోపాటు మరో 75మంది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి చట్టబద్ద సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా, వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఎన్సీపీ.. కలిసే బరిలో దిగుతోంది. చెరో 125 సీట్లలో పోటీ చేస్తుండటం గమానర్హం. గత వారంలో మహారాష్ట్రలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శరద్ పవార్ రాష్ట్రానికి చేసిన మేలేంటని ప్రశ్నించారు.
మంచైనా.. చెడుకైనా శరద్ పవార్ ఎప్పుడూ జైలుకు వెళ్లలేదని, జైలుకు వెళ్లిన వాళ్లే తనను ఏం చేశావంటూ ప్రశ్నిస్తున్నారని శరద్ పవార్ అమిత్ షాకు చురకలంటించారు. అమిత్ షా ఓ కేసులో జైలుకు వెళ్లి.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బయటకు వచ్చారు.