మూడింట రెండొంతుల సీట్లు ఖాయం.. బీజేపీ మెజార్టీపై ఎన్డీఏ నేతల జోస్యం..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయమని బీజేపీ ధీమాతో ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కమలదళం రెండింట మూడొంతుల సీట్లు గెల్చుకోవడం ఖాయమని బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఎన్డీఏ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

2014 కన్నా ఎక్కువ సీట్లు
చివరి దశ సార్వత్రిక ఎన్నికలు ముగియకముందే బీజేపీ గెలుపుపై ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు. 2014లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి బీజేపీకి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. కమలదళానికి మూడింట రెండొంతుల మెజార్టీ వచ్చే అవకాశముందని ఆయన అంచనా వేశారు. గత ఎన్నికల సమయంలో మోడీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నిజం కావడంతో ఇప్పుడు ఆయనపై మరింత విశ్వాసం పెంచుకున్నారని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు.

మమతపై రాజ్నాథ్ ఫైర్
ఎన్నికల సమయంలో బెంగాల్లో హింస చెలరేగడంపై రాజ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకమైన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావులేదన్న ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను సీఎం అడ్డుకోలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మరోవైపు ఉగ్రావాదంపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని రాజ్నాథ్ విమర్శించారు.

సీట్లు తగ్గుతాయన్న అతావలే..
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని కేంద్రమంత్రి రాందాస్ అతావలే అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈసారి కమలదళం కొన్ని ఓట్లు కోల్పోక తప్పదని చెప్పారు. యూపీలో ఎస్పీ - బీఎస్పీ - ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడినందున అక్కడ బీజేపీకి 10 నుంచి 15 సీట్లు తగ్గుతాయని అతావలే జోస్యం చెప్పారు. అటు మహారాష్ట్రలో సైతం 2014 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 5 నుంచి 6 సీట్లు తగ్గుతాయని అంచనా వేశారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గే స్థానాలను బీజేపీ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భర్తీ చేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మోడీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications