Draupadi Murmu: అందుకోలేనంత ఆధిక్యత: ఇక్కడా ఎదురులేని ఎన్డీఏ: అక్కడ పండగే
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి పీఠం ఎవరిని వరిస్తుందనేది స్పష్టమౌతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేసిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తోందనే విషయంపై స్పష్టత ఏర్పడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ముగిసిన ఈ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ కొద్దిసేపటి కిందటే ముగిసింది. ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యతను సాధించారు.
CMIE report: నిరుద్యోగితపై సంచలన నివేదిక: ఏపీ-తెలంగాణల్లో ఇలా
ఆధిక్యత ఇలా..
తొలి విడతలో ఎంపీల ఓట్లను లెక్కపెట్టారు. ఈ లెక్కింపు పూర్తయింది. ఇందులో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్ల విలువ 3,78,000. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పడ్డాయి. వీటి విలువ 1,45,600. కాగా- 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీనితో పార్లమెంట్ సభ్యుల ఓట్ల కేటగిరీలో ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యాన్ని సాధించినట్టయింది. దీని తరువాత శాసన సభ్యుల ఓట్లను లెక్కింపు చేపట్టారు ఎన్నికల అధికారులు.
రెండో విడతగా..
కాగా రెండో విడత కింద శాసనసభ్యుల ఓట్ల లెక్కింపును చేపట్టారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. దేశవ్యాప్తంగా ఉన్న 4,000లకు పైగా శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్ల పద్ధతిన పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో- ఎమ్మెల్యేల ఓట్ల బ్యాలెట్ పత్రాల లెక్కింపు ఫలితం కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాగా పార్లమెంట్ సభ్యుల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యత సాధించారు. దాదాపుగా 60 శాతానికి పైగా ఓట్లు ఆమెకు పోల్ అయ్యాయి.
గెలుపు లాంఛనప్రాయమే..
ద్రౌపది ముర్ము గెలుపు ఇక లాంఛనప్రాయమేననేది ఇక్కడే స్పష్టమౌతోంది. దీనితో ఆమె ఒడిశాలోని ముర్ము స్వగ్రామంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పండగ వాతావరణం నెలకొంది. స్థానికులు గిరిజన సంప్రదాయంలో వేడుకలను జరుపుకొంటోన్నారు. డప్పు కొడుతూ, కొమ్ము బూరలు ఊదుతో సందడి చేస్తోన్నారు. ఒడిశా పహాడ్పూర్లోని ఎస్ఎల్ఎస్ స్మారక రెసిడెన్షియల్ పాఠశాలలో సంబరాలు మిన్నంటాయి.
ఆ పాఠశాలలో..
దివంగతులైన తన భర్త, ఇద్దరు పిల్లలు శ్యామ్, లక్ష్మణ్, సిపాన్ పేర్ల మీద ఎస్ఎల్ఎస్ రెసిడెన్షియల్ పాఠశాలను ద్రౌపది ముర్ము నిర్మించారు. ఆమె దీన్ని నిర్వహిస్తోన్నారు. ఈ పాఠశాల ఆవరణలో గిరిజనులు సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి, నృత్యం చేస్తోన్నారు. తమ ఆనందాన్ని పంచుకుంటోన్నారు. అటు ద్రౌపది ముర్ము స్వగ్రామం రాయ్రంగపూర్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. స్థానిక గిరిజనులు పెద్ద ఎత్తున ఒక చోట గుమికూడి.. వేడుకలను జరుపుకొంటోన్నారు.