నీట్ వివాదంలో కీలక పరిణామం: రేపటి వరకు సమయం కోరిన కేంద్రం!
నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధానంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరిగాయి.
సమయం కోరిన కేంద్రం
ఈ సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ 8 వినతులను ప్రభుత్వానికి సమర్పించింది. కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ పై తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం(జులై 25) మధ్యాహ్నం వరకు సమయం కోరింది. ప్రభుత్వం త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకుంటుందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రెండు ప్రధాన డిమాండ్లకు సూత్రప్రాయ ఆమోదం
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపాదించిన మూడు కీలక డిమాండ్లలో రెండింటికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. నీట్ వ్యవహారం, పేపర్ లీక్ వివాదాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే ఈ నిరసనల సమయంలో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ లు, ఇతర చట్టపరమైన కేసులను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది.
జేపీ నడ్డా నేతృత్వంలో సుదీర్ఘ చర్చలు
కేంద్ర మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధి బృందంతో దాదాపు రెండ గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో నిరసనకారుల ఆందోళన గురించి చర్చించామని.. పరీక్షల సంస్కరణల కోసం వారు 3 ప్రధాన డిమాండ్లు, 5 కీలక సూచలను అందించారని జేపీ నడ్డా పేర్కొన్నారు. జులై 25 మధ్యాహ్నం మళ్లీ సమావేశమై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్పష్టంగా తెలియజేస్తామని ఆయన వెల్లడించారు.














Click it and Unblock the Notifications