మరోసారి కంపించిన నేపాల్: 3వేలు దాటిన మృతుల సంఖ్య
ఖాట్మాండ్: నేపాల్లో సోమవారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. గత 3 రోజుల నుంచి భూ ప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటి వరకు నేపాల్లో భూకంపం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 3వేలకు చేరిందని అధికారులు ప్రకటించారు. ప్రపంచ దేశాల సహకారంతో నేపాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
3వేలు దాటిన మృతుల సంఖ్య
శనివారం ప్రారంభమైన భూకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున దాదాపు రెండు గంటల ప్రాంతంలో మళ్లీ భూమి కంపిందింది. ఈ తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 3,218కి పెరిగిందని, దాదాపు 7 వేల మందికిపైగా గాయపడ్డారని స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు.

కఠ్మాండు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్లను విడిచి బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు తరచూ భూమి కంపిస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భారత సైన్యం, జాతీయ విపత్తు నివారణ సంస్థ సిబ్బందితోపాటు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ అదనపు సెక్రటరీ బికె ప్రసాద్ నేతృత్వంలోని ఇంటర్ మినిస్టీరియల్ టీం సోమవారం ఉదయం నేపాల్ పయనమైంది.
నేపాల్లో చిక్కుకుపోయిన వారిలో దాదాపు రెండు వేల మందిని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విమానం ద్వారా సోమవారం ఉదయం భారత్కు తరలించారు.
ఇంకా వేలమంది భారతీయులు కఠ్మాండు విమానాశ్రయంలో ఎదురుచేస్తున్నారు. ఆదివారం నుంచి నేపాల్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సహాయ చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. కాగా, ఇటు భారత్లోనూ భూకంప మృతుల సంఖ్య 66కు పెరిగిందని ఇక్కడి అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications