భూకంపం: ముందుకు జరిగిన భారత్, కదిలిన ఖాట్మాండ్, ఎవరెస్ట్ అలాగే
వాషింగ్టన్: నేపాల్ భారీ భూకంపం ధాటికి భారత భూభాగం పది అడుగులమేర ఉత్తరంవైపు కదిలినట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నిచోట్ల భారత భూభాగం ఒకటి నుంచి పది అడుగుల వరకు నేపాల్క్రస్ట్(భూ పలక) కిందికి కదిలిందని కొలంబియా విశ్వవిద్యాలయంలోని లామంట్ డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీ పరిశోధకుడు కొలిన్ స్టార్క్ తెలిపారు.
భూకంపం ఇంతటి భారీ మార్పులు సృష్టించినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఎత్తును మాత్రం మార్చలేదని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకుడు జేమ్స్ జాక్సన్ తెలిపారు. నేపాల్లో పెను భూకంపంతో భారత్ 10 అడుగులు ఉత్తర దిశగా ముందుకు కదిలింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ మూడు మీటర్లు దక్షిణానికి జరిగింది.
నేపాల్లోని భరత్పూర్నుంచి బీహార్ అడుగున ఉన్న శిల (శాస్తజ్ఞ్రులు దాన్ని భూఫలకంగా అభివర్ణిస్తారు) హెటవుడా మీదుగా జనక్పూర్ వైపుగా జారిపోయిందని స్టార్క్ పిటిఐకి చెప్పారు. హటాత్తుగా సంభవించే ఈ పరిణామంది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరుగుతుంటుందని చెప్పారు.
భూమి అడుగున ఉండే ఫలకాలు ఎంత వేగంగా కదులుతున్నాయనే విషయాన్ని భూభౌతిక శాస్తవ్రేత్తలు చాలాకాలంగా గమనిస్తూ వస్తుండడం, మొత్తం భారత ఉపఖండంలోని భూమి అడుగు భాగం ఏడాదికి 1.8 అంగుళాల వేగంతో నేపాల్, టిబెట్ వైపుగా కదిలిపోతోందనే విషయాన్ని స్టార్క్ ఇంతకు ముందు సిఎన్ఎన్ వెబ్సైట్లో ప్రచురించిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు.
భూమి లోపల సంభవించే ఒత్తిడి హిమాలయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించడంతో కొన్ని పర్వతాల ఎత్తు కొన్ని మైళ్లు పెరగడం, పాకిస్తాన్నుంచి బర్మా దాకా ఉన్న ప్రాంతంలో తరచూ భూకంపాలు రావడం జరుగుతోంది. ‘గత శనివారం సంభవించిన భూకంపం ఇంతకుముందు వచ్చిన చాలా భూకంపాలకన్నా పెద్దది అయినప్పటికీ అసాధారణమైనది కానీ, అనూహ్యమైనది కాదు' అని స్టార్క్ అన్నారు.
1934లో పది వేల మందిని పొట్టన పెట్టుకున్న బీహార్ భూకంపం తర్వాత గత 81 సంవత్సరాల్లో భారత్లోని భూమి అడుగు భాగం నేపాల్ వైపుగా దాదాపు 12 అడుగులు కదిలిపోయిందని ఆయన చెప్పారు.
భూకంపం తాకిడికి నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నగరం కింద భూమి కొన్ని మీటర్ల మేర దక్షిణం వైపునకు జరిగిపోయిందని, అయితే ఎవరెస్టు పర్వతం ఎత్తు మాత్రం అంతే ఉంటుందని బ్రిటన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు సైతం పేర్కొంటున్నారు. అంతేకాదు భూకంపం భారత ఉపఖండాన్ని యూరేషియా నుంచి వేరు చేసే భూఫలకం అయిన హిమాలయాల ఫలకం సరిహద్దుల్లో సంభవించి ఉండవచ్చని కూడా అభిప్రాయపడ్డారు.