నేపాల్: విమానం కూలుతున్న క్షణాల్లో ఫేస్బుక్ లైవ్...ఆ వీడియోలో ఏముందంటే?
నేపాల్ విమాన ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్లో ఒక వీడియో వైరల్గా మారింది.
విమానం క్రాష్ కావడానికి కొన్ని సెకన్ల ముందు వరకు, బాధితుల్లో ఒకరైన సోనూ జైస్వాల్ ఈ విమానం నుంచి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి నేపాల్ టూర్కు వెళ్లిన నలుగురు స్నేహితుల బృందంలో సోనూ జైస్వాల్ ఒకరు. కాఠ్మాండూ నుంచి పోఖరాకు వెళ్తున్న ఆ విమానంలో వీరు కూడా ఉన్నారు.
ఈ వీడియో ఫుటేజీలో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో, పోఖరా విమానశ్రయానికి చెందిన పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి.
అయితే కొన్ని క్షణాల్లోనే మృత్యువు వారి ముందున్న విషయం జైస్వాల్ సహా ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారికి తెలియదు.
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది బతికి బయటపడ్డ ఆనవాళ్లు కనిపించడం లేదు.
సోనూ జైస్వాల్ తీసిన ఈ వీడియోలో ఆకుపచ్చని పొలాలు, వాటి మధ్యలో చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్న భవంతులు కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత సోనూ జైస్వాల్ కెమెరాను తన వైపుకి తిప్పుకుని, నవ్వుతున్న దృశ్యాలు కనిపించాయి. విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులను లైవ్ వీడియోస్ట్రీమింగ్లో చూపించేందుకు సోనూ జైస్వాల్ ప్రయత్నించారు.
సరిగ్గా ఆ సమయంలోనే విమానం క్రాష్ అయినట్టు కనిపించింది.
సెకన్ల వ్యవధిలోనే పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. కెమెరా రికార్డు అవుతూనే ఉంది స్క్రీనంతా కూడా పొగలు కమ్ముకున్నాయి.
పెద్ద పెద్ద అరుపులు, గ్లాస్లు పగులుతున్న శబ్దాలు, మంటల దృశ్యాలతో వీడియో రికార్డింగ్ ఆగిపోయింది.
- నేపాల్: విమానప్రమాదంలో 'చనిపోయిన’ కో పైలెట్ అంజూకు తెనాలికి సంబంధం ఏంటి...
- నేపాల్: విమానం కూలడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది
సోనూజైస్వాల్ ఫేస్బుక్ అకౌంట్లో ఈ వీడియోను తాము చూసినట్టు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు రిపోర్టర్లకు తెలిపారు.
ఆ తర్వాత ఇది విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియోగా గుర్తించినట్టు చెప్పారు.
సేతి నదికి దగ్గర్లో ఒక వాగులో విమానం కూలిపోయేటప్పుడు సోనూ ఈ లైవ్ స్ట్రీమ్ చేసినట్టు అతని స్నేహితుడు ముకేశ్ కశ్యప్ రిపోర్టర్లకు చెప్పారు.
జైస్వాల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఉన్న వీడియోనే కశ్వప్ తనకు చూపించాడని స్థానిక జర్నలిస్టు శశికాంత్ తివారి బీబీసీకి తెలిపారు.
అయితే ఈ విమానం నుంచి జైశ్వాల్ లైవ్ స్ట్రీమ్ చేసేందుకు ఇంటర్నెట్ ఎలా పొందాడన్న విషయంపై స్పష్టత లేదు.
విమాన ప్రమాదం జరిగే సమయంలో వీడియో తీసిన ఫోన్ను సహాయక సిబ్బంది రికవరీ చేసుకున్నారని నేపాల్లోని మాజీ శాసన సభ సభ్యుడు అభిషేక్ ప్రతాప్ షా భారత టెలివిజన్ చానల్ ఎన్డీటీవీకి తెలిపారు.
''మా స్నేహితుల్లో ఒకరు ఈ వీడియో క్లిప్ను నాకు పంపారు. పోలీసు అధికారి నుంచి దాన్ని వారు పొందినట్టు తెలిపారు. ఇది నిజమైనదే’’ అని షా ఎన్డీటీవీకి చెప్పారు.
- గాలిలో విమానం, అపస్మారక స్థితిలో పైలట్.. ఒక ప్రయాణికుడు ఏం చేశారంటే..
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
అయితే నేపాల్ అధికారులు మాత్రం ఈ ఫుటేజీపై ఆయన కామెంట్లను ధ్రువీకరించలేదు. ఈ వీడియో వారి విచారణలో సాయపడే అవకాశం ఉంది.
జైశ్వాల్తో పాటు అభిషేక్ కుష్వాహ, అనిల్ రాజ్భర్, విశాల్ శర్మలు కూడా ఈ విమానంలో ఉన్నారు. తమ బిడ్డలను కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈ బాధను చెప్పడం చాలా కష్టమని అభిషేక్ కుష్వాహ సోదరుడు చంద్రభన్ మౌర్య కన్నీరు పెట్టుకున్నారు.
ప్రభుత్వం వారి చేయగలిగిన సాయమంతా చేయాలని అన్నారు. తమ వారి మృతదేహాలను తమకు అప్పగించాలని కోరారు.
ప్రమాదంలో చనిపోయిన నలుగురు వ్యక్తుల కుటుంబాలతో, కాఠ్మాండూలోని భారతీయ రాయబారి కార్యాలయంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, వీలైనంత సాయం చేస్తామని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాపూర్ అధికారులు తెలిపారు.
''వారు కాఠ్మాండూ వెళ్లాలనుకుంటే, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని బాధితుల కుటుంబ సభ్యులకు తెలిపాం’’ అని జిల్లా కలెక్టర్ అర్యక అఖౌరి విలేఖర్లకు చెప్పారు.
ఈ నలుగురు చాలా స్నేహంగా ఉండేవారని గ్రామస్తులు గుర్తుకు చేసుకున్నారు.
వీరి కుటుంబాలకు పరిహారం అందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
- నేపాల్: ల్యాండింగ్కు కొన్ని సెకన్ల ముందు కూలిన విమానం, 68కి పెరిగిన మృతుల సంఖ్య
- ఖతర్: ఈ మరణాలకు బాధ్యులెవరు
కాఠ్మాండూ సమీపంలోని శివుని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించుకునేందుకు వారు జనవరి 13న నేపాల్కి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు.
అక్కడి వెళ్దామని జైస్వాల్ స్నేహితుల్ని కోరాడని ఆ ముగ్గురిలో ఒకరి తండ్రి చెప్పారు. కొడుకు కోసం జైస్వాల్ ఆ దేవాలయంలో పూజలు చేస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు.
దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత, అన్నపూర్ణ పర్వత శ్రేణులకు దగ్గర్లో ఉన్న నేపాల్ పర్యాటక ప్రాంతంలో పారాగ్లైడ్ చేసేందుకు వారు ఆదివారం పోఖరాకు బయలు దేరారు.
ఆ తర్వాత వారు కాఠ్మాండూకు రావాలనుకున్నారు.
కానీ, వారి తలరాత మరో విధంగా రాసి ఉందని జైస్వాల్ కుటుంబ సభ్యుల్లో ఒకరు న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపారు.
ఈ నేపాల్ ప్రమాదంలో చనిపోయిన అయిదుగురు భారతీయల్లో వీరు నలుగురు.
ప్రమాదంలో మరణించిన వారిలో 53 మంది నేపాలీలు కాగా, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు.
యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రయాణికులున్నారు.
సోమవారం భారత్లో ఈ విమానం ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, జైస్వాల్ షూట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్లిప్ చూడటం తన వల్ల కాదంటూ జైస్వాల్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ జైస్వాల్ అన్నారు. సోనూ స్నేహితుల నుంచే తాను ఈ విషయం విన్నట్టు చెప్పారు. తమ జీవితాలు తలకిందులయ్యాయని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
కుటుంబానికి చెప్పకుండా తమ కొడుకు ఈ నెల 13న నేపాల్ వెళ్లాడని అనిల్ రాజ్భర్ తండ్రి చెప్పారు. ఈ దుర్వార్తను అనిల్ తండ్రి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- వీరసింహారెడ్డి: అమెరికా థియేటర్లను హడలగొడుతున్న తెలుగు సినిమా 'సంస్కృతి’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్చరణ్ల 'నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?
- దేవికా రాణి: బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ 'ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?
- క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)