నేతాజీ చనిపోయాడు.. రుజువు చూపలేను: నెహ్రూ
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు భారత ప్రభుత్వం గతంలోనే పేర్కొన్నట్లు తేలింది. 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన దుర్ఘటనలో ఆయన మరణించినట్లు 1995లో ప్రభుత్వం ప్రకటించినట్లు వెల్లడైంది.
నేతాజీ అంతుచిక్కని అదృశ్యంపై 50 ఏళ్ల తర్వాత వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సదరు విమాన ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత నేతాజీని యుద్ధ నేరస్థుడిగా పేర్కొనే విషయంలో లాభనష్టాలను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి విశ్లేషించినట్లూ తెలుస్తోంది.
ఇలాంటి వివరాలన్నీ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ పరచిన రహస్య పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. నేతాజీ 119వ జయంతి సందర్భంగా శనివారం బోస్ బంధువుల సమక్షంలో ప్రధాని మోడీ 16,600 పుటలతో కూడిన 100 రహస్య దస్త్రాలను బహిరంగ పరిచారు.
భారత జాతీయ ప్రాచీనపత్ర భాండాగారంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ పత్రాలను విడుదల చేశారు. ఈ పత్రాలను ఎన్ఏఐ బోస్పై రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో ఉంచింది. వంద దస్త్రాలకు అదనంగా ప్రతినెలా 25 రహస్య దస్త్రాల డిజిటల్ నకళ్లను ప్రజల్లోకి విడుదల చేయాలని ఎన్ఏఐ యోచిస్తోంది.
1956 నుంచి 2013 వరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి సంబంధించిన 36 దస్త్రాలు, హోంశాఖకు చెందిన 18 దస్త్రాలు, విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన 46 దస్త్రాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు దస్త్రాలను పరిశీలించారు. మోడీ. బోస్ కుటుంబ సభ్యులతోనూ ముచ్చటించారు.
తాజాగా బయటపెట్టిన పత్రాల్లో 1995 ఫిబ్రవరి 6న అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి కె పద్మనాభయ్య సంతకం చేసిన పత్రం కూడా ఉంది. అందులో.. నేతాజీ 1945 ఆగస్టు 18న తైహోకులో విమాన ప్రమాదంలో మరణించడంపై అనుమానించే పరిస్థితి కనిపించడం లేదని, దీనిని భారత ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, నాటి ప్రధాని నెహ్రూ 1962 మే 13న నేతాజీ సోదరుడు సురేశ్ చంద్రబోస్కు నేతాజీ మరణించినట్టు ధ్రువీకరిస్తూ లేఖ రాశారు. అయితే ఇందుకు ప్రత్యక్ష ఆధారలేమీ లేవన్నారు. పరిస్థితులను బట్టి నేతాజీ మరణించినట్టు భావించాల్సి వస్తోందని, ఆయన ఒకవేళ నిజంగా బతికి ఉంటే సంతోషంగా భారత్కు తాను ఆహ్వానించేవాడినని నెహ్రూ ఆ లేఖలో తెలిపారు. బోస్ను నెహ్రూ యుద్ధ నేరస్థుడి చెప్పినట్లుగా తెలుస్తోంది.