మిజోరాం ఎన్నికలు: మిన్నంటిన నిరసనలు... రాష్ట్ర ఎన్నికల అధికారిపై వేటు
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్పై నిరసనల పర్వం ఊపందుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆశిష్ కుంద్రాను మిజోరాం కొత్త ఎన్నికల అధికారిగా నియమించింది. నవంబర్ 28న మిజోరాంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6,7 తేదీల్లో శశాంక్ను ఎన్నికల అధికారిగా తొలగించాలంటూ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరగడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
మిజోరాం ప్రిన్సిపల్ సెక్రటరీ లాల్నిన్మావియా చావాంగో ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకుంటున్నారని ఆరోపించడంతో శశాంక్కు ప్రభుత్వానికి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదే అంశాన్ని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం. దీంతో శశాంక్ను ఎన్నికల అధికారిగా తొలగించాలంటూ పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి.
ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న లాల్నిన్మావియా మిజోరాం ఎన్నికల పట్టికలో బ్రూ శరణార్థులను చేరుస్తూ పట్టికను మేనేజ్ చేశారంటూ శశాంక్ ఫిర్యాదు చేశారు. 1997లో చోటుచేసుకున్న అల్లర్ల తర్వాత ఈ శరణార్థులను త్రిపురకు పంపించివేశారు. ఇప్పుడు వారి పేర్లను ఎన్నికల పట్టికలో చేర్చడంలో లాల్నిన్మావియా కీలక పాత్ర పోషించారని శశాంక్ ఆరోపించారు. దీంతో లాల్నిన్మావియాను తొలగించింది ప్రభుత్వం. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడి రాజకీయ పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టివేసింది.
ఇక లాల్నిన్మావియాను తొలగించడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ తాన్హావ్ల శశాంక్ను తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇక ప్రధాన ఎన్నికల సంఘం నుంచి శశాంక్కు నోటీసులు రావడంతో నిరసనలు తగ్గాయి.