కార్మికుల వేతనాలు పెంచుతూ కొత్త సీఎం ఆతిశీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ కీలక నేత ఆతిశీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతనాన్ని పెంచింది ఆప్ సర్కారు. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని సీఎం ఆతిశీ తెలిపారు.
ఢిల్లీ సర్కారు తాజా నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రూ. 18,066, మధ్యస్థ నైపుణ్యం కలిగిన వారికి రూ. 19,929, నైపుణ్యం కలిగినవారికి రూ. 21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు అవసరమైన ప్రతి చర్యనూ ప్రభుత్వం చేపడుతుందని సీఎం ఆతిశీ ప్రకటించారు.

ఇది ఇలావుండగా, కొత్త సీఎం ఆతిశీకి ఢిల్లీ పోలీసులు జడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఆమె కాన్వాయ్లో పైలట్తో సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రోటోకాల్ ప్రకారం.. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎంకు జెడ్ కేటగిరీ వర్తిస్తుంది. దీంతో ఆతిశీకి రక్షణగా ఢిల్లీ పోలీసులు 22 మందిని షిఫ్టుల వారీగా మోహరించనున్నారు.
జెడ్ కేటగిరీ భద్రతలో పీఎస్ఓలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు. కాగా, ఎప్పటికప్పుడు ముప్పును అంచనా వేసి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కేంద్ర సంస్థలు ఆమె భద్రతను సమీక్షించే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై ఇటీవల విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆతిశీని ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమెతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం కార్యాలయంలో ఒక కూర్చీని ఖాళీగా ఉంచి.. దాని పక్కనే మరో కూర్చీని ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు సీఎం ఆతిశీ. అరవింద్ కేజ్రీవాల్ కోసం ఆ కూర్చీని ఖాళీగా ఉంచడం గమనార్హం. తాను రామాయణంలో భరతుడి పాత్ర పోషిస్తున్నట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications