న్యూ కోవిడ్ స్ట్రెయిన్ ఎఫెక్ట్... మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ.. ఈ నిబంధనలు తప్పనిసరి...
బ్రిటన్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్(న్యూ కోవిడ్ స్ట్రెయిన్) ప్రపంచాన్ని మళ్లీ బెంబేలెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్నామని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది. 8 నెలల క్రితం కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ప్రపంచం ఎంతలా అతలాకుతలమైందో మళ్లీ అలాంటి పరిస్థితులకు నెట్టివేయబడుతామా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే అప్రమత్తమైన చాలా దేశాలు బ్రిటన్కు విమానా సర్వీసులను నిషేధించాయి. భారత్ కూడా బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ...
ముంబై సహా మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాల్లో డిసెంబర్ 22వ తేదీ నుంచి రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీరోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పరిస్థితులపై సోమవారం(డిసెంబర్ 21) నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిబంధనలు తప్పనిసరి..
యూరోపియన్,మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రేపటి నుంచి(డిసెంబర్ 22) ఇది అమలులోకి వస్తుందని చెప్పింది. యూరోప్ నుంచి వచ్చి క్వారెంటైన్లో ఉన్నవారికి ఐదో రోజు లేదా ఆరో రోజు కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారని తెలిపింది. కొత్త రకం వైరస్ లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. యూరోప్,మిడిల్ ఈస్ట్ నుంచి కాకుండా వేరే దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులు హోమ్ క్వారెంటైన్ పాటించాలని సూచించింది.'కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా పొంచే ఉన్నది. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరవద్దు. తప్పనిసరిగా మాస్కు ధరించడం,భౌతిక దూరం పాటించడం,ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం చేయాలి.' అని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
70శాతం వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం వైరస్...
బ్రిటన్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. రూపాంతరం చెందిన వైరస్ 70శాతం వేగంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నిపుణులు చెప్తున్నారు.బ్రిటన్లో 1000కి పైగా కేసుల్లో ఈ కొత్త రకం కరోనా వైరస్ను గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన,రాబోతున్నాయా కరోనా వ్యాక్సిన్లు ఈ కొత్త రకం వైరస్ను నియంత్రించగలుగుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కెనడా,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రియా,ఇటలీ,హాంకాంగ్ తదితర దేశాలు ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులు రద్దు చేశాయి.