భారత్లో 165కు చేరిన యూకే కరోనా కేసులు: దేశంలోని వివిధ రాష్ట్రాలకు నమూనాలు
న్యూఢిల్లీ: దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య 165కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మంత్రుల బృందంతో జరిగిన సమావేశం సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన సమీక్షించారు. యూకే స్ట్రెయిన్ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల్లో వైరస్లో జన్యు మార్పులను గుర్తించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వారి నమూనాలను పంపుతున్నామని తెలిపారు. వాటిలో ఢిల్లీలోని ఎన్సీడీసీలో 42, ఐజీఐబీలో 51, బెంగళూరులోని ఎన్సీబీఎస్ లో 5, పుణె ఎన్ఐవీలో 44, హైదరాబాద్ సీసీఎంబీలో 8, బెంగళూరు నిమ్స్ హాన్స్లో 14, కోల్ కతా ఎన్ఐబీజీ ల్యాబుల్లో ఒకటి చొప్పున యూకే స్ట్రెయిన్ కేసులను గుర్తించామని వెల్లడించారు. కాగా, దేశంలోని కొన్ని జిల్లాల్లో గత నెల రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
ఇది ఇలావుండగా, గత కొద్ది వారాలుగా తగ్గుకుంటూ వచ్చిన కొత్త కరోనా కేసులు ఒక్క రోజు వ్యవధిలో కొంత పెరిగాయి. గురువారం ఒక్కరోజే 7,42,306 నమూనాలను పరీక్షించగా 18,855 కొత్త వైరస్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,20,048కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 163 మంది కరోనా బారినపడి మరనించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,54,010కి చేరింది. నిన్న ఒక్కరోజే 20,746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,03,94,352కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,71,686 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.