ఎన్డీయేలో చీలిక ? ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మిత్రపక్షాల తలోమాట..! మళ్లీ సుప్రీంకోర్టుకు...!
రాష్ట్రాలు ఎస్సీ కులాల ఉపవర్గీకరణ చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన చారిత్రక తీర్పు ఇప్పుడు కేంద్రంలో అధికార ఎన్డీయేను కుదిపేస్తోంది. సంకీర్ణ భాగస్వాముల మధ్య ఈ తీర్పు చిచ్చురేపేలా ఉంది. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రంలో కీలక మిత్రపక్షం టీడీపీ స్వాగతిస్తుండగా.. మరో భాగస్వామి లోక్ జన్ శక్తి పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా సిద్దమవుతోంది. దీంతో బీజేపీ ఇరుకునపడుతోంది.
గతవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత టీడీపీ నేతలతో పాటు దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాదిన మాత్రం ఈ తీర్పు చిచ్చురేపుతోంది. ముఖ్యంగా బీహార్ తో పాటు హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి చోట్ల సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పడనుంది. అందుకే ఇప్పుడు దళితుల ప్రతినిధిగా చెప్పుకునే యూపీ నేత మాయావతి సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ సుప్రీంకోర్టు తీర్పుపై అధికారికంగా స్పందించేందుకు ఇష్టపడటం లేదు. అసలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణ జరగాలంటే దేశవ్యాప్తంగా జనగణన చేయక తప్పని పరిస్ధితి. దీన్ని బీజేపీ ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి దక్షిణాదిన లాభం చేసే, ఉత్తరాదిన నష్టం చేసే సుప్రీంకోర్టు తీర్పుపై కాషాయ నేతలు స్పందించేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తుందని విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రచారానికి ఉత్తరాదిన ఈ తీర్పు బలం చేకూర్చేలా ఉంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పష్టంగా స్పందించే పరిస్ధితి లేదు. దక్షిణాది సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య వంటి వారు దీన్ని స్వాగతిస్తుండగా. ఉత్తరాది నేతలు మాత్రం స్పందించడం లేదు. అలాగే సుప్రీం తీర్పులో దళితులకూ క్రిమిలేయర్ నిబంధన (ఆదాయ పరిమితి) పెట్టాలన్న అంశాన్నీ ఇప్పుడు చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీతో సంబంధం లేకుండా ఎన్డీయే మిత్రపక్షం లోక్ జన్ శక్తి పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసే రివ్యూ పిటిషన్ కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications