దుర్వినియోగం అరికట్టేందుకే: నూతన ఐటీ నిబంధనలపై ఐక్యరాజ్యసమితికి భారత్ క్లారిటీ
న్యూఢిల్లీ: నూతనంగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాను వినియోగించే సాధారణ యూజర్ల సాధికారత కోసమే నూతన నిబంధనలు రూపొందించామని తెలిపింది. పౌర సమాజం, ఇతర భాగస్వామ్యపక్షాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నూతన ఐటీ నిబంధనలను రూపొందించామని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా దుర్వినియోగం కారణంగా బాధితులనవారి వేదనను పరిష్కరించడానికి ఇదొక వేదిక అవుతుందని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో భారత ప్రభుత్వం క్లారిటీనిచ్చింది. సోషల్ మీడియాతోపాటు డిజిటల్ వేదికలపై వేధింపులు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియామకాలు, అశ్లీల కంటెంట్, ఆర్థిక మోసాలు, హింసను ప్రేరేపించే సమాచార వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నూతన ఐటీ నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని వివరించింది.
కాగా, భారత్ తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి చెందిన ముగ్గురు ప్రతినిధులు జూన్ 11న కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఐరాసకు ఐటీ నూతన నిబంధనలపై స్పష్టతనిచ్చింది.
ఆందోళన చెందాల్సిన అంశమేమీ లేదని తేల్చి చెప్పింది. మే 26 నుంచి కేంద్రం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్న ట్విట్టర్ ఇండియాకు.. ఇక్కడి చట్టాలకు లోబడి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.