కొత్తగా రూ.350 నోటు! సోషల్ మీడియాలో వైరల్, క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. మొన్నీమధ్యనే రూ.200 నోటు కూడా రంగ ప్రవేశం చేసింది.
ఈ క్రమంలో ఆర్బీఐ కొత్తగా రూ.350 నోటు విడుదల చేస్తుందని... నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ.2000 నోటు చెలామణీని త్వరలోనే ఆపేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
అంతేకాదు, ఆర్బీఐ కొత్తగా తీసుకురాబోతున్న రూ.350 నోటు ఇలానే ఉండబోతుందంటూ ఓ నోటు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరు మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు కూడా.
అయితే ఈ వార్తపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఇదంతా తప్పుడు వార్త అంటూ తేల్చి చెప్పింది. అంతేకాక సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మొద్దని కూడా సూచించింది.
మార్ఫింగ్ చేసి విడుదల చేసిన రూ.350 నోటు ఇమేజ్... వైల్డ్ రెడ్ కలర్లో, ఆశ్చర్యకరమైన నమూనాల్లో ఉన్నాయి. ఈ నోటును కొత్త రూ.200, రూ.50 నోట్లను మార్ఫింగ్ చేసి రూపొందించినట్టు తెలిసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది.
దీంతో నిజంగానే ఆర్బీఐ కొత్తగా రూ.350 నోటు తీసుకొస్తుందేమోనని పలువురు భావించారు. కానీ ఇదంతా తప్పుడు ప్రచారమంటూ ఆర్బీఐ కొట్టిపారేసింది. అసలు రూ.350 నోటును విడుదల చేసే ఆలోచన, ఉద్దేశం లేదని వెల్లడించింది.