Budget 2020: కొత్త పన్ను ప్రతిపాదనలతో ఈ రెండు రంగాలకు భారీ దెబ్బ
న్యూఢిల్లీ: శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో భాగంగా కొత్త పన్ను ప్రతిపాదనలను చేశారు. ఈ కొత్త పన్ను ప్రతిపాదనలతో రెండు కీలక రంగాలకు పెద్ద దెబ్బ పడనుంది. ఒకటి ఎగుమతి రంగం మరొకకటి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కూడా ఈ ప్రభావం పడనుంది.
కొత్త పన్ను ప్రతిపాదన ప్రకారం ఏడాదికి రూ.50 లక్షలకు పైగా సరకు అమ్మితే అమ్మకందారుడు కొనుగోలు దారుడి నుంచి 0.1శాతం పన్ను వసూలు చేయాలని ఉంది. ఒకవేళ కొనుగోలుదారుడి వద్ద పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ లేకపోతే 1శాతం పన్ను వసూలు చేయాలని కొత్త ప్రతిపాదనలో ఉంది. అయితే దీనిపై ఆర్థిక నిపుణులు నెగిటివ్గా స్పందిస్తున్నారు. ఎలాంటి ఆలోచన చేయకుండా ఈ ప్రతిపాదన చేశారని మండిపడుతున్నారు. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈలపై భారీ ప్రభావం చూపుతుందని చెబుతున్న ట్యాక్స్ ఎక్స్పెర్ట్స్... ఈ పరిశ్రమలు నడుపుతున్న వారిలో చాలామంది పన్ను కట్టే పరిధిలోకి రారని చెబుతున్నారు. వీరికి పాన్ లేదా ఆధార్ నెంబర్లు లేవని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం సరకులు కొన్న సమయంలో ఎగుమతిదారులు 1శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది లేదా ఎక్కువ మార్జిన్కు వారి సరకులను విక్రయించాల్సి ఉంటుంది.దీంతో మార్కెట్ పోటీలో వీరు నిలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఇక కొత్త విధానంతో చాలా వ్యాపారాలకు సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం లేదా ప్రొవిజన్ చేర్చడం వల్ల పన్ను వసూళ్లు పెరుగుతాయనుకోవడం పొరపాటవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ విక్రయదారుడు ఎగుమతి దారుడుగా మారితే అప్పుడు కొనుగోలు దారుడు కచ్చితంగా భారత దేశానికి చెందిన వాడు అయి ఉండడు.అలాంటప్పుడు భారత్లో వారు పన్నులు కట్టాల్సిన పనిఉండదు. ప్రత్యేక ప్రొవిజన్ల కింద మాత్రమే వారు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇలా జరిగితే భారత్ ఎగుమతుల ఖరీదు కనీసం 1శాతమైనా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎగుమతిదారుడే ఈ ఖర్చును భరాయించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎగుమతిదారుడుకు సంబంధించి లాభాల మార్జిన్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది.
కొత్త ప్రొవిజన్ వల్ల ఒక్క ఎగుమతిదారుడిపైనే ప్రభావం చూపదని ఇతర పెద్ద కార్పొరేట్లు, పీఎస్యూ, ఇతర ఎగుమతిదారులపై కూడా పడుతుందని చెబుతున్నారు వేద్ జైన్ అనే చార్టర్డ్ అకౌంటెంట్. ఇండియన్ ఆయిల్కు ఏడాది టర్నోవర్ 5లక్షల కోట్లు ఉండగా దీనిపై అధిక ప్రభావం పడుతుందని వేద్ జైన్ చెప్పారు.