బందర్ టెక్కీ అనూహ్య హత్య కేసులో కొత్త ట్విస్ట్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో చంద్రభాను సనప్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన నివేదిక దర్యాప్తునపై తీవ్ర ప్రభావం చూపుతోందని జాతీయ మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
అనూహ్య శవంపై సనప్ డిఎన్ఎ నమూనాలు లేవని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీంతో పోలీసులు సర్క్యుమస్టిన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సాక్షులపై కూడా ఆధారపడవచ్చు. సనప్ తీసుకున్నాడని భావిస్తున్న అనూహ్య ల్యాప్టాప్ జాడ తెలియడం లేదు.
ఆంధ్రప్రదేశ్లోని బందరుకు చెందిన అనూహ్య ముంబైలోని టిసిఎస్లో పనిచేస్తూ ముంబైలోని అంథేరీలో ఉండేది. క్రిస్మస్ పండుగకు నిరుడు డిసెంబర్ 22వ తేదీన మచిలీపట్నం వచ్చిన అనూహ్య ఈ ఏడాది జనవరి 5వ తేదీన ముంబై చేరుకుంది. ఆమె ముంబైలోని ఎల్ఎఎల్టి నుంచి కనిపించకుండా పోయింది.
ఆమె శవం జనవరి 16వ తేదీన భందుప్ (తూర్పు)లోని టాటా నగర్ పొదల్లో కనిపించింది. టెర్మినస్లోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చంద్రభాన్ సనప్ను అరెస్టు చేశారు. నాసిక్కు చెందిన సనప్ అనూహ్యను ఇంటి వద్ద దింపుతానని చెప్పి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్నారు.
మరణించిన తర్వాత చాలా రోజులకు శవం లభించడంతో ఫోరెన్సిక్ పరీక్షల్లో డిఎన్ఎ నమూనాలు మాయమై ఉండవచ్చునని, అది కేసుపై ఏ విధమైన ప్రభావం చూపదని దర్యాప్తు అధికారులు అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
సనప్ మిత్రుడు నందకిశోర్ సాహు సాక్ష్యం తమకు ఈ కేసులో పనికి వస్తుందని, నేరం చేయడానికి సనప్ అతని బైక్ వాడాడని అంటున్నారు. సనప్ సోదరి ఇంట్లో అతని దుస్తులు కూడా దొరికాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. అమ్మాయి అతనికి కలిసి నడుస్తున్న సిసిటివీ ఫుటేజ్ కూడా ఉందని చెబుతున్నారు.